కొత్తగా ఒక్క కరోనా కొత్త కేసు నమోదు: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని జెసిండా
వెల్లింగ్టన్: కరోనావైరస్ మహమ్మారి పట్ల న్యూజిలాండ్ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో కరోనాను అరికట్టిన దేశంగా రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ దేశంలో దాదాపు ఆరు నెలల తర్వాత తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దేశంలోని ఆక్లాండ్లో ఒకరికి కరోనా సోకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ దేశ వ్యాప్తంగా మూడు రోజులపాటు లాక్డౌన్ ప్రకటించారు.
సదరు వ్యక్తి కరోనా టీకా తీసుకోలేదని, ఆగస్టు 12 నుంచి వైరస్తో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ అప్లే బ్లూమ్ ఫీల్డ్ తెలిపారు. అతను తన భార్యతో క లిసి వారాంతంలో స్తానికంగా పర్యటించాడని, రగ్భీ ఆటను చూసేందుకు వెళ్లాడని చెప్పారు. దీంతోలాక్ డౌన్ విధించినట్లు తెలిపారు. అయితే, కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగడం లేదని, అందుకే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ కరోనా కేసును డెల్టా వేరియంట్గా అనుమానిస్తున్నామనన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని చెప్పారు. అందుకే దానికి తగినట్లుగా స్పందిస్తున్నామన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని జెసిండా తెలిపారు. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అలాంటి పరిస్థితులు తమ దేశంలో రాకుండా చర్యలు తీసుకుంటున్నామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా తెలిపారు. కాగా, దాదాపు ఏడాది తర్వాత దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడం ఇదే తొలిసారి.
ఇది ఇలావుండగా, ప్రపంచంలోని పలు దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో రోజూ దాదా లక్ష కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. టెస్టుల సంఖ్య తగ్గినప్పుడు మాత్రమే కొత్త కేసుల సంఖ్యా తక్కువగా నమోదవుతోంది. కొత్తగా ఇరాన్లో కరోనా విపరీతంగా పెరుగుతోంది. అటు ఇండొనేసియాలోనూ కరోనా మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక థాయిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనాపై చాలా సీక్రెట్ మెయింటేన్ చేస్తున్న చైనాలో సోమవారం 51 కొత్త కేసులు వచ్చాయి. అక్కడ కూడా డెల్టా వేరియంట్ ప్రభావం చూపిస్తోంది.
Recommended Video
ఇక ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. భారతదేశం గత 24 గంటల్లో మొత్తం 25,166 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ఇదే సమయంలో 437 మరణాలు నమోదయ్యాయి. ఇది మార్చి 16 తర్వాత అత్యల్పంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా మంగళవారం తెలిపింది. గత 24 గంటల్లో 15,63,985 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 25,166 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,69,846కి తగ్గింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీలు దేశవ్యాప్తంగా 3,14,48,754 వద్ద ఉన్నాయి. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 12,101 తగ్గాయి. కరోనా కేసులు నమోదులో గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే కేరళలో అత్యధికంగా 12,294 కేసులు నమోదయ్యాయి, తరువాత మహారాష్ట్రలో 4,145 కేసులు, తమిళనాడులో 1,851 కేసులు, కర్ణాటకలో 1,065 కేసులు మరియు ఆంధ్రప్రదేశ్లో 909 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో 80.52 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. ఒక్క కేరళ మాత్రమే 48.85 శాతం కేసులను నమోదు చేసింది.