కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు..
స్టాక్ హోమ్: ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతల పేర్ల పరంపరలో మరో అంకం. రసాయనిక శాస్త్రం కేటగిరీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. జాన్ బీ గూడెనోఘ్ (జర్మనీ), ఎం స్టాన్లీ విట్టింగ్ హాం (యూకే), అకీరా యోషినో (జపాన్) లకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ అవార్డును అందజేయనున్నారు. స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గొరాన్ కే హ్యాన్సన్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. సెల్ ఫోన్లు, ల్యాప్ టాపు, ఎలక్ట్రిక్ కార్లల్లో వినియోగించే లిథియం ఆధారిత బ్యాటరీలను రూపొందించినందుకు వారికి ఈ అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ముగ్గురూ ప్రొఫెసర్లే..
1922లో జర్మనీలో జన్మించిన జాన్ బీ గూడెనోఘ్ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఎం స్టాన్లీ కూడా అమెరికాలో ఉంటున్నారు. బింగ్ హ్యామ్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్టాన్లీ 1941లో జన్మించారు. మీజో యూనివర్శిటీ ప్రొఫెసర్ గా పని చేస్తోన్న అకీరా యోషినో 1948లో జపాన్ లో జన్మించారు. రసాయనిక శాస్త్రంలో వారు ముగ్గురూ విస్తృత పరిశోధనలు చేశారు. ప్రస్తుతం మనం వినియోగిస్తోన్న సెల్ ఫోన్లు, ల్యాప్ టాపులు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే లిథియం ఆధారిత బ్యాటరీలను వారు కనుగొన్నారు.
వైర్ లెస్ రంగంలో విప్లవాత్మకం..
ఈ తరహా బ్యాటరీలను రూపొందించడమే కాకుండా.. ఎలా వినియోగించాలనే అంశంపైనా విస్తృత పరిశోధనలు చేశారు. ఫలితంగా- లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. వైర్ లెస్ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగానికి విస్తృతం కావడానికి ఈ బ్యాటరీలే ప్రధాన కారణమని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నోబెల్ ఫౌండేషన్ వెల్లడించింది. తక్కువ బరువుతో ఉండేలా, వందలాది సార్లు ఛార్జింగ్ చేయడానికి వీలుగా లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలకు ప్రధాన కారణమైన ఫార్ములాను కనుగొన్నారని ప్రశంసించింది.
విస్తృత పరిశోధనలు..
లిథియం అయాన్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు యానోడ్, క్యాథోఢ్ మధ్య ఎన్నిసార్లయినా ప్రవహిస్తాయనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ బ్యాటరీలను రూపొందించినట్లు నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది. విద్యుదావేశాన్ని అత్యధికంగా కలిగి ఉండే ఎలక్ట్రోడ్స్ వలయాలను ధ్వంసం చేయని విధంగా, ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ వెలువడని విధంగా లిథియం అయాన్ బ్యాటరీలను రూపొందంచడం రసాయనిక శాస్త్రంలో ఓ గొప్ప మలుపుగా ఫౌండేషన్ అభిప్రాయ పడింది. ఈ రంగంలో వారు చేసిన పరిశోధనలు అంచనాలకు మించి ఫలించాయని పేర్కొంది.
మరో రెండు కేటగిరీల్లో..
కాగా- ఇప్పటికే మెడికల్, ఫిజిక్స్ కేటగిరీల్లో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తల వివరాలను రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. తాజాగా కెమిస్ట్రీ కేటగిరీలో కూడా పేర్లు వెల్లడయ్యాయి. ఇక సాహిత్యం, ప్రపంచ శాంతి విభాగాలకు సంబంధించిన వారి పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. గురు, శుక్ర వారాల్లో ఆ పేర్లను వెల్లడిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన స్టాక్ హోమ్ లో జరిగే కార్యక్రమంలో వారికి అవార్డులను అందజేస్తారు. అవార్డు కింద సుమారు ఆరున్నర కోట్ల రూపాయల నగదు, బంగారు పతకాన్ని బహూకరిస్తారు.