కాల్పుల కలకలం: బేస్బాల్ స్టేడియం వద్ద కాల్పుల్లో నలుగురు మృతి, ఆట రద్దు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్లోని బేస్బాల్ స్టేడియం వెలులప దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బేస్బాల్ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ కాల్పుల ఘటన కారణంగా వాషింగ్టన్ నేషనల్స్, శాండియాగో మధ్య జరగాల్సిన ఆట రద్దయింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేక్షకులను స్టేడియం బయటకు పంపించారు. మొత్తం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ముష్కరుల కోసం గాలింపు చేపట్టారు. అయితే, అప్పటికే దుండగులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ వాషింగ్టన్ డీసీ నేవీ యార్డ్ పక్కనే ఉన్న జాతీయ పార్కు వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని తొలుత పోలీసులు ట్వీట్ చేశారు. ఆ వెంటనే బుల్లెట్ గాయాలైన మరో ఇద్దర్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ముప్పులేదని తెలిపారు.
కాగా, కాల్పుల శబద్ధం వచ్చిన వెంటనే స్టేడియంలోని ప్రేక్షకులు కొందరు బయటకు.. కొందరు లోపలికి పరుగులు తీశారు. అధికారులు విజ్ఞప్తి మేరకు పలువురు తమ తమ సీట్లలోనే కూర్చుండిపోయారు.
12 కంటే ఎక్కువ సార్లు కాల్పుల శబ్ధం వినబడటంతో ఆటను నిలిపివేశారని, దీంతో ఆటగాళ్లను మైదానం నుంచి డ్రెస్సింగ్ రూంకు వెళ్లారని స్థానిక మీడియా ప్రతినిధులు తెలిపారు.