కువైట్లో భారతీయ కార్మికుల నెత్తిన పిడుగు: ప్రమాదంలో 8 లక్షల మంది: కొత్త బిల్లుకు ఆమోదం
కువైట్ సిటీ: ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని కువైట్కు వలస వెళ్లిన లక్షలాది మంది భారతీయుల కార్మికుల మనుగడ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. కనీసం ఎనిమిది లక్షల మంది భారతీయ కార్మికులు ఉపాధిని కోల్పోవడమే కాదు.. కువైట్లో నివసించడం కూడా ఇప్పుడు కష్టతరంగా మారబోతోంది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల కువైట్ సహా గల్ఫ్ దేశాల్లో మౌలిక కల్పన, నిర్మాణరంగం స్తంభించిపోవడం వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దానికి తోడుగా అన్నట్లు.. కొత్తగా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది.
తాజ్ మహల్ క్లోజ్: గోల్కొండ, హంపి సహా అన్ని చారిత్రక కట్టడాల్లో అనుమతి ఉన్నా.. అక్కడ మాత్రం
15 శాతానికి మాత్రమే అనుమతి
పొరుగు దేశాల నుంచి కువైట్కు వలస వచ్చే కార్మికులను నియంత్రించడానికి రూపొందించిన ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లును ఆ దేశ జాతీయ అసెంబ్లీ లీగల్ అండ్ లెజిస్లేటివ్ కమిటీ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. కువైట్ జనాభాలో భారతీయుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. 15 శాతానికే పరిమితం చేస్తూ ఈ బిల్లులో పలు కీలక అంశాలను పొందుపరిచింది కువైట్ ప్రభుత్వం. ఈ బిల్లు అంచనా ప్రకారం.. ప్రస్తుతం కువైట్లో 14.50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. 15 శాతానికి పరిమితం చేయడం వల్ల ఎనిమిది లక్షల మంది స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది.
కువైట్ జనాభాలో విదేశీయులే అధికం..
2020 జనాభా గణన ప్రకారం.. కువైట్ జనాభా 42,70,571. ఇందులో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వలస కార్మికుల సంఖ్యే అధికం. కనీసం 25 లక్షల నుంచి 29 లక్షల వరకు విదేశీ వలస కార్మికులు కువైట్లో నివసిస్తున్నారు. వారిలో భారత్ నుంచి తరలి వెళ్లిన కార్మికులదే అధిక వాటా. దీన్ని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చే వలస కార్మికులను నియంత్రించాలనే ఉద్దేశంతో కువైట్ ప్రభుత్వం కొత్తగా ఈ ప్రవాసీ కోటా బిల్లును రూపొందించింది. జాతీయ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది.
భారత్తో పాటు..
కువైట్లో ఉన్న విదేశీ వలస కార్మికుల్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వారు చాలామందే ఉన్నారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్ వంటి దేశాలకు చెందిన కార్మికులు అక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్యను మూడుశాతానికే పరిమితం చేసింది కువైట్ ప్రభుత్వం.. ఈ బిల్లు ఆధారంగా. ఫలితంగా కువైట్ జనాభాలో 70 శాతం వరకు ఉన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను 30 శాతానికి పరమితం చేయడానికి వీలు కల్పించినట్టయింది.
Recommended Video
ముందే వెల్లడించిన కువైట్
తమ దేశంలో నివసిస్తోన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా ఓ బిల్లును రూపొందించబోతన్నామని కువైట్ ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. ఈ మేరకు కువైట్ ప్రధానమంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. దీన్ని ఇంత వేగంగా అమలు చేస్తారని భావించలేదని అంటున్నారు. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే లక్షలాది మంది ప్రవాస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇక తాజాగా కువైట్ తీసుకొచ్చిన ఈ బిల్లుతో మనుగడ కూడా కోల్పోయే ప్రమాదంలో పడినట్టయింది.