స్కూల్లో విద్యార్ధి విచక్షణారహితంగా కాల్పులు-8 మంది పిల్లలు, సెక్యూరిటీ గార్డు మృత్యువాత..
పాశ్చాత్య దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. విచ్చలవిడిగా ఆయుధాలు కలిగిన దుండగులు జరుపుతున్న కాల్పుల్లో సాధారణ పౌరులతో పాటు పిల్లకు కూడా మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఇవాళ సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో స్కూల్లో చదువుకుంటున్న 8 మంది పిల్లలతో పాటు ఓ గార్డు కూడా చనిపోయాడు.
ఇవాళ ఉదయం బెల్గ్రేడ్ ఎలిమెంటరీ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి కాల్పులు జరపడంతో కనీసం ఎనిమిది మంది విద్యార్థులతో పాటు ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయినట్లు అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ కాల్పుల్లో ఓ ఉపాధ్యాయుడు కూడా గాయపడినట్లు సమాచారం అందినట్లు తెలిపింది. గాయపడిన వారికి అత్యవసర సేవలు అందిస్తున్నారు.

స్కూల్లో చదువుతున్న ఓ అనుమానిత మైనర్ ... తన తండ్రి తుపాకీ నుండి అనేక రౌండ్లు కాల్పులు జరిపినట్లు సెర్బియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అనుమానిత మైనర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని పెట్రోలింగ్లను వెంటనే సంఘటనా స్థలానికి పంపారని వెల్లడించింది. ఏడవ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థులు, పాఠశాల సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపినట్లు నిర్దారించారు.
ఘటన జరగ్గానే స్కూలు నుంచి పిల్లలు అరుస్తూ బయటకు పరుగెత్తడం చూసినట్లు స్ధానికులు తెలిపారు. తల్లిదండ్రులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. షూటర్ గురించి తెలిసిన ఒక విద్యార్థి అతన్ని మౌనంగా ఉండే వ్యక్తిగా తెలిపాడు. గతంలో అతను మంచి గ్రేడ్లు సాధించాడని, కానీ అతని గురించి పెద్దగా తెలియదని వెల్లడించాడు. ఈ ఘటనలకు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications