మగవారికి మాత్రమే: జో బిడెన్ సంచలన ప్రకటన: ఏప్రిల్ 19 నుంచి ఆరంభం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే జోరు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైంది ఈ అగ్రరాజ్యంలోనే. అమెరికాలో ఇప్పటిదాకా 5,63,206 మంది కరోనా బారిన పడి ప్రాణాలొదిలారు. మూడు కోట్లకు పైగా పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనా కేసుల వ్యాప్తికి బ్రేకులు పడట్లేదు. అంతకంతకూ వేల సంఖ్యలో కొత్త కేసులు రికార్డవుతూనే వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వంద రోజుల ప్రణాళిక అమల్లో ఉంటోంది.
ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు జో బిడెన్ సంచలన ప్రకటన చేశారు. 90 శాతం మంది పురుషులకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని వెల్లడించారు. వయస్సుతో సంబంధం లేకుండా..దేశంలో నివసించే 90 శాతం మంది పురుషులు వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులని తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీ నాటికి దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
ఫెడరల్ ఫార్మసీ వ్యాక్సినేషన్ కేంద్రాలను కూడా భారీగా పెంచబోతున్నామని స్పష్టం చేశారు. 17 వేల వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని, ఆ సంఖ్యను 40 వేలకు పెంచనున్నట్లు బిడెన్ పేర్కొన్నారు. తన వంద రోజుల పరిపాలన పూర్తయ్యే సరికి దేశవ్యాప్తంగా 200 మిలియన్ మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఇదివరకు జో బిడెన్ అధికార యంత్రాంగానికి నిర్దేశించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ఊపందుకుంటోన్న కొద్దీ ఆయన తన టార్గెట్లను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. 90 శాతం మంది పురుషులకు వ్యాక్సిన్ ఇవ్వాలంటూ సూచించారు.
ఇప్పటిదాకా 143 మిలియన్ల మంది ప్రజలకు వ్యాక్సిన్లను అందజేసినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రోచెల్లె వలెన్స్కీ వెల్లడించారు. 65 సంవత్సరాలకు పైనున్న వయస్సున్న వారిలో 50 శాతం మందికి టీకాలను వేసినట్లు చెప్పారు. మొత్తం దేశ జనాభాలో 16 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ పూర్తయిందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సి ఉందని, అందులో భాగంగానే ఏప్రిల్ 19 నాటికి 90 శాతం మంది పురుషులకు వ్యాక్సినేషన్ ఇవ్వడాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పాజిటివ్ కేసుల పెరుగుదలలో వేగం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.