రక్తమోడిన రాజధాని: పరీక్షా కేంద్రంపై ఆత్మాహూతి దాడి - 100 మంది విద్యార్థులు దుర్మరణం
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై ఉగ్రవాదులు దాడి చేశారు. మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనలో సుమారు 100 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
రాజధాని కాబుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాబుల్ పశ్చిమప్రాంతంలో గల దష్త్-ఇ-బార్చీ ప్రాంతంలోని కాజ్ విద్యాసంస్థపై ఆత్మాహూతి దళ సభ్యుడు దాడి చేశాడు. తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో సుమారు 100 మంది విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక మీడియా టోలో తెలిపింది.
దష్త్-ఇ-బార్చీ ప్రాంతంలో హజారా, షియా ముస్లింలు ఎక్కువగా నివసిస్తుంటారు. వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇవ్వాళ ఓ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోన్నందున కాజ్ విద్యాసంస్థ కార్యకలాపాలు యధాతథంగా ఆరంభం అయ్యాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9
— BILAL SARWARY (@bsarwary) September 30, 2022
వారంతా పరీక్ష రాస్తోన్న సమయంలో ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే విద్యాసంస్థ భవనం ధ్వంసమైంది కొన్ని గదులు కుప్పకూలిపోయాయి. విద్యార్థుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తరువాత భయానక పరిస్థితులు అక్కడ కనిపించాయి. సంఘటన స్థలం మొత్తం రక్తసిక్తమైంది. తెగిన కాళ్లు, చేతులు విసిరేసినట్టుగా పడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. చాలినన్ని అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది స్థానికులు గాయపడ్డ వారిని తమ చేతులు, భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరికొందరు వాహనాలు, స్కూటర్లపై వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఈ దాడికి తామే కారణమంటూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. ఈ దాడి పట్ల అమెరికా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.