అమెరికా నుంచి 205 మంది భారతీయుల బహిష్కరణ- టెక్సాస్ లో ఎగిరిన విమానం..!
అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్..దేశవ్యాప్తంగా వీరిని గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తున్న అమెరికా.. ఇవాళ భారత్ కు చెందిన వలసల్ని బహిష్కరించింది. ఈ మేరకు 205 మంది అక్రమ వలసదారులతో కూడిన సీ17 సైనిక విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి గాల్లోకి ఎగిరింది
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసల్ని బహిష్కరిస్తున్న ట్రంప్.. ఇవాళ భారత్ కు చెందిన వారిని కూడా పంపేశారు. ఈ మేరకు భారత్ నిర్ధారించిన 205 మందిని సీ17 సైనిక విమానంలో ఆ దేశానికి తరలించినట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే భారత్ కు ఇలా అక్రమ వలసల్ని పంపుతున్న తొలి విమానం కూడా ఇదే. మరోవైపు ఎయిర్-ట్రాన్స్పోర్టబుల్ గాలీతో అమర్చబడితే తప్ప ఈ విమానంలో ఒకే టాయిలెట్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో అక్రమ వలసదారులపై బహిష్కరణ వేటు వేసి పంపేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఇప్పటికే సైనిక విమానాల్లో గ్వాటెమాల, పెరూ, హోండురాస్,బ్రెజిల్ వలసల్ని బహిష్కరించారు. ఇప్పుడు భారత వలసల్ని కూడా బహిష్కరిస్తున్నారు. ఈ నెలలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ట్రంప్ ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. ఈ లోపే ఇలా భారతీయుల తరలింపు మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే వీరి తరలింపు ప్రారంభమైందని చెప్తున్నారు.
అమెరికాలో మొత్తం భారతీయ వలసదారులు సంఖ్య 7.25 లక్షలుగా ఉంది. వీరిలో 18 వేల మందిని మాత్రమే అక్రమ వలసదారులుగా గుర్తించారు. దీంతో వీరిని స్వదేశానికి పంపేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్కడ మిగిలిన భారతీయుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. గతంలో అమెరికాకు పరుగులు తీసిన పలువురు భారతీయులు తాజా పరిణామాలతో డిఫెన్స్ లో పడుతున్నారు.












Click it and Unblock the Notifications