జయహో భారత్ : ఆర్థికశాస్త్రంలో భారత సంతతి వ్యక్తి అభిజీత్కు నోబెల్ పురస్కారం
Recommended Video
ఓస్లో: 2019 ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఎకానమిస్ట్ అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించింది. అభిజీత్తో పాటు ఈ పురస్కారం అతని భార్య ఎస్తేర్ డఫ్లో మరియు మైఖేల్ క్రెమర్లకు దక్కింది. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు పరిశోధనలు చేసినందుకుగాను వీరి కృషిని గుర్తిస్తూ జ్యూరీ ఈ త్రయంను నోబెల్ బహుమతితో గౌరవించింది. ఇక ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు అందజేయడం ప్రారంభించి 50 ఏళ్లు అయ్యింది. ఇలా ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మహిళల్లో ఎస్తేర్ రెండో మహిళగా చరిత్ర సృష్టించింది.
నోబెల్ బహుమతులు: ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
ప్రపంచాన్ని పీడిస్తున్న పేదరికం
గత కొద్ది కాలంగా ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు అడుగులు పడుతున్నాయి. మానవాళిని పట్టి పీడిస్తున్న అంశాల్లో ముఖ్యమైనది పేదరికం. నేటికీ 700 మిలియన్ మంది ప్రజలు కఠిక పేదరికంలో మగ్గుతున్నారు. ఊటా 5 మిలియన్ మంది చిన్నారులు వ్యాధుల బారిన పడి ఆ జబ్బులను నయం చేసుకునేందుకు అయ్యే ఖర్చు భరించలేక మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సగం మంది చిన్నారులు చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు.
పేదరిక నిర్మూలనపై కృషి చేసిన అభిజీత్ త్రయం
ఈ అంశాలపైనే ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజీత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో, క్రెమర్లు పరిశోధనలు చేసి ప్రపంచంలో పేదరికంను ఎలా నిర్మూలించగలమో చెప్పారు. పెద్ద సమస్యలను చిన్నవిగా విభజించి వాటిని మేనేజ్ చేయగలిగితే పేదరికంను చాలా వరకు తగ్గించవచ్చనేది పరిశోధనల ద్వారా తెలిపారు. ఉదాహరణకు విద్యావ్యవస్థలో మార్పులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ త్రయం కొన్ని సూచనలను చేసింది. ఈ సమస్యలను చిన్నవిగా విభజించి ప్రశ్నలు సంధించుకుంటే సమాధానం దొరుకుతుందని అభిజీత్ త్రయం వెల్లడించింది.
వీరి సూచనలను పాటిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు
1990లో మైఖేల్ క్రెమర్ అతని సహోద్యోగులు పశ్చిమ కెన్యాలో విద్యావ్యవస్థపై స్టడీ చేశారు. ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ల ద్వారా పాఠశాలలో ఎలా మార్పు తీసుకురాగలమో చేసి చూపించారు. ఇదే పంథాలో ఇతర దేశాల్లో మిగతా సమస్యలను కూడా అభిజీత్ , ఎస్తేర్ డఫ్లో మరియు మైఖేల్ క్రెమర్లు విజయవంతంగా పరిష్కరించగలిగారు. వీరు చేసిన ప్రయోగాలు, పరిశోధన విధానాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అమలు చేస్తున్నాయి. తద్వారా వారి వారి దేశాల్లో పేదరికం తగ్గుముఖం పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.