ఎయిర్పోర్టులో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం, ఇద్దరు మృతి, 60 మందికిపైగా గాయాలు
లీమా: పెరూ విమానాశ్రయంలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్ వేపైనుంచి టేకాఫ్ అవుతున్న లాటమ్ ఎయిర్లైన్స్ విమానం ఓ ఫైర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా రన్ వేను రాసుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విమానం ఢీకొట్టడంతో ఇద్దరు ఫైర్ ఫైటర్స్ మృతి
విమానానికి ప్రమాదం సంభవించడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. కానీ, విమానం ఢీకొట్టడంతో అగ్నిమాపక వాహనంలోని ఇద్దరు ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోయారు.
పెరూ విమానాశ్రయంలో రెస్క్యూ టీం అలర్ట్
లాటమ్ పెరూ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్ఏ 2213 విమానం లీమా-జులియకా రూట్ కవర్ చేస్తోంది. టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వేపై ఉన్న ఓ ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానం ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. రన్ వేను రాసుకుంటూ వెళ్లడంతో నిప్పులు కురిశాయి. వెంటనే అప్రమత్తమైన రెస్క్కూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విమానం ఆగిన వెంటనే అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, చాలా మంది ప్రయాణికులకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
60మందికిపైగా గాయాలు, ఇద్దరి పరిస్థితి సీరియస్
పెరూ ఆరోగ్యమంత్రి మాట్లాడుతూ.. గాయపడిన 20 మంది ప్రయాణికులను ఆస్పత్రిలో చికిత్స అందించామని చెప్పారు. ఇద్దరి పరిస్థితి కాస్త విషమంగా ఉందని తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది కానీ, ప్రయాణికులు కానీ మరణించలేదన్నారు.
స్వల్పంగా గాయపడిన 61 మంది ప్రయాణికులకు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు మంత్రి తెలిపారు. కాగా, ఈ విమాన ప్రమాదంపై పెరూ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన ఫైర్ ఫైటర్స్ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.