కుప్పకూలిన మిలిటరీ విమానం: 17మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని జబుల్ ప్రావిన్స్లో గురువాం మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించారని ప్రావిన్సియల్ పోలీస్ చీఫ్ మిర్వాయిస్ నూర్జాయి కాబూల్లో వెల్లడించారు.
మృతుల్లో 12మంది సైనికులు, ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఈశాన్య లోగర్ ప్రావిన్స్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు ఓ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో 8మంది ప్రజలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బాలి విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో జూన్ చివర్లో మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం బద్ధలైంది. నెలలు గడుస్తున్నా అగ్నిపర్వతం పొగలు గక్కుతూనే ఉంది. మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం నుంచి అత్యధికంగా పొగలు వెలువడుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు.
కాగా, 1000మీటర్ల మేర పొగలు వ్యాపించడంతో సమీపంలోని బాలీ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పలు విమానాల రాకపోకలను రద్దు చేశారు. రెండు నెలల్లో ఈ విమానాశ్రయాన్ని నాలుగోసారి మూసేశారు. బాలీ విమానాశ్రయానికి ఆస్ట్రేలియా నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.