పాక్ ప్రధానికి అఫ్గాన్ ప్రధాని షాక్: ఫోన్లో మాట్లాడేందుకు నిరాకరణ, మోడీకి ఓకే
కాబూల్: పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రాఫ్ ఘనీ షాకిచ్చారు. అబ్బాసీతో ఫోన్లో మాట్లాడేందుకు అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తిరస్కరించారు. వరుస ఉగ్రదాడులతో ఆ దేశం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తన సంతాపాన్ని తెలిపేందుకు మంగళవారం రాత్రి అబ్బాసీ ఫోన్ చేయగా అష్రఫ్ తిరస్కరించారని ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఇటీవల అఫ్గానిస్థాన్లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో సుమారు 150 మంది చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. తమ దేశంలో ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ వెన్నుదన్నుగా నిలుస్తోందని అఫ్గాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ఇటీవల జరిగిన దాడులకు సంబంధించిన సాక్ష్యాలను ఆ దేశం సేకరించిందని, వాటిని పాక్ ఆర్మీతో పంచుకునేందుకు కొంతమంది ప్రతినిధులను పంపిందని ఆ దేశ మీడియా పేర్కొంది.
ఇది ఇలా ఉంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయగా ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రాఫ్ ఘనీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఖండించారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అఫ్ఘాన్కు అండగా ఉంటామని తెలిపారు.