కారుబాంబు పేలుడు: 12 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
కాబూల్: దక్షిణ ఆఫ్గనిస్థాన్లోని లష్కర్గా పట్టణంలో శుక్రవారం కారుబాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరో 40 మందికి పైగా గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
హెల్మెండ్ ప్రావిన్స్లోని ఘాజీ మహమ్మద్ ఆయూబ్ ఖాన్ క్రీడా మైదానానికి సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ క్రీడా మైదానంలో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. బాంబు పేలుడుతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.

మరోవైపు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆసుపత్రి వర్గాల సమాచారం.
ఈ పేలుడుకు బాధ్యులెవరన్నది ఇప్పటి వరకు తెలియలేదు. ఏ తీవ్రవాద సంస్థ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కారు బాంబు పేలుడు ఘటనను ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు.
రెండ్రోజులు క్రితమే దేశ రాజధాని కాబూల్లోని యూనివర్సిటీ వద్ద ఐసిస్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఘటనలో 29 మంది మరణించగా, 52 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మళ్లీ రెండ్రోజుల వ్యవధిలోనే కారు బాంబు పేలుడు సంభవించడం గమనార్హం.












Click it and Unblock the Notifications