Facebook: తాలిబన్లకు షాక్ ఇచ్చే స్టేట్మెంట్
వాషింగ్టన్: ఆప్ఘనిస్తాన్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశం మొత్తాన్నీ ఆక్రమించి, అష్రఫ్ ఘనీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసిన తాలిబన్లకు షాక్ ఇచ్చే స్టేట్మెంట్ వెలువడించింది. తాలిబన్లను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా పరిగణించిన నేపథ్యంలో- కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇందులో భాగంగా- తాలిబన్లు వినియోగిస్తోన్న ఫేస్బుక్ అకౌంట్లన్నింటినీ నిషేధించింది. తాలిబన్ అనుబంధ సంఘాల అకౌంట్లకూ దీన్ని వర్తింపజేసింది.
కొన్ని సంవత్సరాలుగా తాలిబన్లు టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ను వినియోగించుకుంటోన్నారు. దాని ద్వారా తమ మెసేజీని వ్యాప్తి చేస్తూ వస్తోన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేకంగా కొన్ని సోషల్ మీడియా గ్రూపులను క్రియేట్ చేసుకున్నారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఫేస్బుక్ ప్లాట్ఫామ్ను వాడుకుంటోన్నారు. వాట్సప్ గ్రూపులను రూపొందించుకున్నారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో- తాలిబన్లు, వారితో సంబంధాలను కొనసాగిస్తోన్న వారి అకౌంట్లనూ బ్యాన్ చేసింది ఫేస్బుక్. తాలిబన్ను అమెరికా ప్రభుత్వం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించిందని ఫేస్బుక్ అధికార ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిషేధించాలనేది తమ సంస్థ విధానమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. డేంజరస్ ఆర్గనైజేషన్లను ప్రమోట్ చేయకూడదంటూ తాము విధానాలను రూపొందించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
అక్కడితో ఆగలేదు ఫేస్బుక్ మేనేజ్మెంట్. ఇక ముందు కూడా తాలిబన్లకు సంబంధించిన ఏ ఒక్క సమాచారం కూడా పోస్ట్, షేర్ కానివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఆప్ఘనిస్తాన్ నిపుణులతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని నియమించుకుంది. ఆఫ్ఘన్ పర్షియన్ డరి, పాష్తో తెలిసిన నిపుణులను ఇందులో అపాయింట్ చేసింది. ఆఫ్గన్ భాష, భౌగోళిక స్థితిగతుల గురించి బాగా తెలిసిన వారిని ఈ టీమ్లో చేర్చినట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి చెప్పారు. తాలిబన్లు, ఆఫ్గాన్కు సంబంధించిన ఎలాంటి సమాచారం పోస్ట్ అయినా దాన్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.