తాలిబన్లకు షాక్ : మహిళల ధిక్కారం-సోషల్ మీడియాలో ఆ ఫోటోలతో నిరసన-ఇదే అసలైన సంస్కృతి అంటూ..
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల రాజ్య స్థాపన తర్వాత ఎక్కువ ఆందోళనకు,హింసకు గురవుతున్నది మహిళా సమాజమే. అడుగడుగునా ఆంక్షలతో,హక్కుల నిరాకరణతో మహిళలను తాలిబన్లు అణచివేస్తున్నారు. మాట వినకపోతే బెదిరింపులు,వేధింపులకు గురిచేసి మరీ దారికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల తాలిబన్లకు మద్దతుగా కాబూల్ యూనివర్సిటీలో పదుల సంఖ్యలో మహిళలు బుర్ఖా ధరించి ఒక్కచోట చేరిన సంగతి తెలిసిందే. తాము తాలిబన్ల పాలనకు మద్దతునిస్తున్నామని ఆ మహిళలు ప్రకటించారు. అయితే దీని వెనకాల తాలిబన్ల బెదిరింపులు ఉన్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాలిబన్ బెదిరింపులకు తలొగ్గి బలవంతంగా ఆ మహిళలు ఆ సమావేశానికి హాజరుకావాల్సి వచ్చింది. మరోవైపు #DoNotTouchMyClothes,#AfghanistanCulture హాష్ ట్యాగ్స్తో ఆఫ్గన్ మహిళలు తాలిబన్లపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బలవంతంగా ఆ కార్యక్రమానికి మహిళలు...
షరియా చట్టం ప్రకారం ఆఫ్గన్ మహిళలంతా బుర్ఖా ధరించాల్సిందేనని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లు,యూనివర్సిటీలు,ఇతరత్రా ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరిగా బుర్ఖా ధరించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ఆపాదమస్తకం బుర్ఖాతో కవర్ చేసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొంతమంది మహిళలు బుర్ఖాలు ధరించి కాబూల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఓవైపు హక్కుల కోసం కొంతమంది మహిళలు రోడ్డెక్కుతుంటే... మరికొందరు ఇలా తాలిబన్ ఆంక్షలను స్వాగతించడం చర్చనీయాంశమైంది. అయితే ఆ కార్యక్రమానికి హాజరైనవారంతా బలవంతంగా వెళ్లినవారేనని వెల్లడైంది.
తాలిబన్ల హుకుంను ధిక్కరిస్తూ...
తాలిబన్ల బుర్ఖా హుకుంను ధిక్కరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉంటున్న ఆఫ్గన్ మహిళలు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.సాంప్రదాయ దుస్తులు ధరించి... ఇది తమ అసలైన సంస్కృతి అని చాటుతున్నారు.అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్గనిస్తాన్లో మాజీ ఫ్యాకల్టీ సభ్యురాలైన బహర్ జలాలి దీనిపై స్పందిస్తూ... ఆఫ్గనిస్తాన్ చరిత్రలో మహిళలంతా ఆపాదమస్తకం నల్లటి బుర్ఖా ధరించిన దాఖలా లేదన్నారు. అది ఆఫ్గన్ సంస్కృతి కానే కాదని అన్నారు.దీన్ని నిరసిస్తూ తాను సాంప్రదాయ దుస్తులు ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు చెప్పారు. బుర్ఖానే ఆఫ్గన్ సంస్కృతి అన్న తాలిబన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఇలా చేస్తున్నామని తెలిపారు.
సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలను షేర్ చేస్తున్న ఆఫ్గన్ మహిళలు...
వస్లత్ హస్రత్ జహాన్ అనే జర్నలిస్టు కూడా తాను సాంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఇదీ ఆఫ్గన్ సంస్కృతి... ఆఫ్గన్ మహిళల డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది.' అని పేర్కొన్నారు.సనా సఫీ అనే మరో బీబీసీ జర్నలిస్ట్ కూడా సాంప్రదాయ దుస్తుల్లో దిగిన తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'ఒకవేళ నేను ఆఫ్గనిస్తాన్లో ఉండి ఉంటే నా తల చుట్టూ స్కార్ఫ్ ఉండేది. కానీ నా దృష్టిలో ఇవే సాంప్రదాయ దుస్తులు.' అని అభిప్రాయపడ్డారు.సొదబా హైదరే అనే బీబీసీ జర్నలిస్ట్ కూడా సాంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.'ఇవి మా సాంప్రదాయ దుస్తులు.మాకు రంగులంటే చాలా ఇష్టం. అందుకే మా బియ్యం,జాతీయ జెండా కూడా రంగులమయంగా ఉంటాయి.' అని పేర్కొన్నారు.పెయ్మనా అనే ఆఫ్గన్ సంతతికి చెందిన యూకె మహిళ సైతం సాంప్రదాయక ఆఫ్గన్ దుస్తులు ధరించి తాలిబన్ పాలనపై నిరసన వ్యక్తం చేశారు.
తిరుగుబాటునే అణచివేసేందుకే
ఇటీవల 33 మంది మంత్రులతో తాలిబన్లు ప్రకటించిన ప్రభుత్వంలో మహిళలకూ ఎక్కడా చోటు దక్కలేదు. దీన్ని నిరసిస్తూ పదుల సంఖ్యలో మహిళలు కాబూల్లో నిరసన తెలియజేశారు. తాలిబన్లు తమపై విధిస్తున్న ఆంక్షలను కూడా వారు నిరసించారు. ఈ నేపథ్యంలో మహిళా తిరుగుబాటును అణచివేసేందుకు మహిళలనే తాలిబన్లు ప్రయోగించారు. నిరసన తెలియజేస్తున్న మహిళలు యావత్ ఆఫ్గన్ మహిళా సమాజానికి ప్రతినిధులుగా భావించాల్సిన అవసరం లేదని కొంతమంది మహిళలతో ప్రకటనలు ఇప్పించారు. కాబూల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పదుల సంఖ్యలో మహిళలు హాజరై తాలిబన్ పాలనకు మద్దతు ప్రకటించారు. అయితే దీని వెనకాల తాలిబన్ల బెదిరింపులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
మళ్లీ యూనివర్సిటీలో అడుగుపెట్టలేరు... తాలిబన్ల బెదిరింపులు
తాలిబన్లు బెదిరింపులకు గురిచేయడం వల్లే కాబూల్ వర్సిటీలో సమావేశానికి హాజరైనట్లు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. 'కాబూల్లోని యూనిర్సిటీలో సమావేశమై తమకు మద్దతు తెలియజేయాల్సిందిగా తాలిబన్లు మాపై ఒత్తిడి తెచ్చారు. బుర్ఖాలు పంపిణీ చేసి తాలిబన్ జెండాలు చేతికిచ్చి మమ్మల్ని పంపించారు.చెప్పినట్లు చేయకపోతే మరోసారి యూనివర్సిటీలో అడుగుపెట్టకుండా చేస్తామని హెచ్చరించారు.' అని ఓ విద్యార్థిని వాపోయినట్లు ఆఫ్గనిస్తాన్కు చెందిన నతీక్ మలిక్జాదా అనే జర్నలిస్ట్ పేర్కొన్నారు.
విద్యా సంస్థల్లో ఆంక్షలు...
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ సర్కార్ ఏర్పాటు కాకముందే హెరాత్ ప్రావిన్స్లోని విద్యా సంస్థల్లో కోఎడ్యుకేషన్ను తాలిబన్లు నిషేధించారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో స్త్రీ,పురుషులు కూర్చొనే క్లాసుల్లో... ఇరువురి మధ్య పరదాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. నిజానికి స్త్రీలన్నా,విద్య అన్నా తాలిబన్లకు మొదటి నుంచి గిట్టదు.సమాజంలోని సకల రుగ్మతలకు విద్యనే కారణమని ఇటీవల తాలిబన్ విద్యాశాఖ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ పీహెచ్డీలు,మాస్టర్ డిగ్రీలు లేకుండానే తాలిబన్లు అధికారంలోకి వచ్చారని... చదువుకున్నవాళ్ల కంటే తాలిబన్లే గొప్ప అని ఆయన వ్యాఖ్యానించారు.
మళ్లీ ఆ చీకటి పాలన... మహిళల్లో ఆందోళన
ఆఫ్గనిస్తాన్లో 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు పూర్తిగా హక్కులను నిరాకరించారు.స్త్రీలు చదువుకునే స్కూళ్లను మూసివేయించారు. బుర్ఖా ధరించకుండా,మగతోడు లేకుండా బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. అక్రమ సంబంధాలు పెట్టుకునేవారిని రాళ్లతో కొట్టి చంపడం,బహిరంగ శిరచ్చేదనం వంటి శిక్షలు విధించేవారు.స్త్రీలు కేవలం సంతానాన్ని కనేందుకు పనికొస్తారని... వారికి విద్య,ఉపాధి,రాజకీయాలతో పనిలేదని చెప్పేవారు. ప్రస్తుత తాలిబన్ పాలనలోనూ ఇవన్నీ రిపీట్ అవుతాయని అక్కడి మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రావిన్స్లలో తాలిబన్లు ఆడపిల్లలను అపహరించి ఆకృత్యాలకు పాల్పడుతున్నారనే వార్తలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే.