ముగిసిన పెలోసి పర్యటన: 27 విమానాలతో తైవాన్ను హడలెత్తిస్తున్న చైనా
తైపీ: యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన ఉద్రిక్తతలను మరింత పెంచాయి. నాన్సీ తైపీ పర్యటన ముగించుకుని వెళ్లిన గంటల వ్యవధిలోని చైనా 27 యుద్ధ విమానాలను తైవాన్ దేశ పరిధిలోకి పంపింది.చైనా విమానాలు.. తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ)కి వచ్చినట్లు తైవాన్ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
ఆరు జె-11 ఫైటర్ జెట్లు, ఐదు జె-16 మల్టీరోల్ ఫైటర్స్, 16 ఎస్యు-30 మల్టీరోల్ ఫైటర్స్ బుధవారం ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించాయి.
"27 PLA విమానం (J-11*6, J-16*5, SU-30*16) ఆగస్ట్ 3, 2022న R.O.C. పరిసర ప్రాంతంలోకి ప్రవేశించింది" అని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. 21 చైనా సైనిక విమానాల తర్వాత ఈ చొరబాటు సోమవారం రాత్రి తైవాన్ వైమానిక రక్షణ జోన్ నైరుతి భాగంలోకి వెళ్లింది. చైనా దురాక్రమణకు ప్రతిస్పందిస్తూ.. తైవాన్ పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక ఎయిర్ గస్తీని పంపింది. విమాన నిరోధక క్షిపణి వ్యవస్థలను కూడా మోహరించింది.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా.. అమెరికా తీరుపై మండిపడింది. తాజాగా తైవాన్ను.. అష్ట దిగ్బంధనం చేసింది. తైవాన్ గగనతలాన్ని మూసివేసి.. విమాన రాకపోకలు అడ్డుకుంది. తైవాన్ సముద్ర మార్గాన్ని దిగ్బంధించింది. తైవాన్ ఎయిర్డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించి తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి.
తైవాన్కు పది కిలోమీటర్ల సమీపంలోని షామాంగ్ నగరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారీ సైనిక వాహనాలను మోహరించింది. తైవాన్ జలసంధిలో చేపట్టిన సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లోకి చైనా విస్తరించింది. తైవాన్ గగనతలం, సముద్ర మార్గాలను చైనా మూసివేసింది. చైనా చుట్టూ ఆరు జోన్లలో.. సైనిక కసరత్తులను చేపట్టింది.
తైవాన్ నుంచి దిగుమతులను కూడా చైనా నిలిపివేసింది. కాగా, చైనా చర్యలను.. తైవాన్ తప్పుబట్టింది. అంతర్జాతీయ చట్టాలను చైనా ఉల్లంఘిస్తోందని, తైవాన్ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా తమ ప్రాదేశిక జలాల్లోకి చొచ్చుకొచ్చి సైనిక కసరత్తు చేస్తోందని ఆక్షేపించింది. మరోవైపు, అమెరికాను కూడా చైనా తీవ్రంగా హెచ్చరించింది. అగ్గితో చెలగాటమాడుతున్నారని మండిపడింది. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించింది. మరోవైపు, పెలోసీ పర్యటన చైనాకు ఎలాంటి సంక్షోభం కాదని.. అమెరికా తెలిపింది. చైనా కోపానికి సరైన హేతువులేదని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కెర్బీ చెప్పారు.