ఆ ఎయిర్ఏషియా విమానం సముద్రంలో కూలిందా? ఇండియన్స్ లేరు
ఇండోనేషియా: ఎయిర్ ఏషియా విమానం ఒకటి అదృశ్యమైంది. ఇండోనేషియాలోని సూరబాయ నుండి సింగపూర్ వెళ్తున్న క్యూజెడ్8501 విమానానికి కంట్రోల్ రూమ్ (ఏటీసీ)తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు.
అందులో 155 మంది ప్రయాణీకులు. ప్రయాణీకులలో 149 మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఏడుగురు క్రూ మెంబర్స్. ఎయిర్ ఏషియా విమానం ఇండోనేషియాలోని సూరబాయ నుండి సింగపూర్కు బయలుదేరింది.
ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సింగపూర్ రావాల్సి ఉండగా ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అదృశ్యమైన విమానం ఎయిర్ ఏషియా కోసం అధికారులు గాలిస్తున్నారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఎయిర్ ఏషియా ప్రకటించింది.
విమానం కూలిందా?
గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం ఓ సముద్రంలో కూలినట్లుగా వార్తలు వచ్చాయి. జావా సముద్రంలో అది కూలిందని అంటున్నారు. బెలితుంగ్ద్వీపం వద్ద అది కూలిందని సమాచారం. కాగా, ఇందులో భారతీయులు ఎవరు లేరని అధికారులు చెప్పారు.