నాన్న వస్తాడని ఎయిర్ ఏషియా పైలట్ కూతురు: ఆలస్యంతో ఫ్యామిలీ బతికింది, ఏడ్చారు
ఇండోనేషియా: ఎయిర్ ఏషియా క్యూజెడ్ 8501 గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్ కూతురు ఓ ఎమోషనల్ (ఉద్వేగ) సందేశాన్ని సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో పెట్టింది. తన తండ్రికి ఆమె ఆ సందేశం పెట్టింది. 'పాపా, ఇంటికి వస్తాడు. నీ కోసం వేచి చూస్తున్నా' అని పైలట్ కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో పెట్టింది.
ఆమె వయస్సు 22. 'మా పాపాను తిరిగి పంపించండి. పాపా, ప్లీస్ ఇంటికి రా' అనే సందేశం కూడా ఆమె తన పేజీలో పెట్టింది. పైలట్ విషయమై ఆయన పక్కింటి వ్యక్తి, ఆయన స్నేహితుడు బగియాంటో జోయోనెగోరో మాట్లాడుతూ.. అతను చాలా మంచి వ్యక్తి అని, అందుకే అతనిని ఇక్కడ అపాయింట్ చేశారని చెప్పారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
అతను మంచి అనుభవజ్ఞుడు!
గల్లంతైన ఎయిర్ ఏషియా పైలట్ మంచి అనుభవజ్ఞుడు అని అందరు గుర్తు చేసుకుంటున్నారట. అతను కమర్షియల్ ఎయిర్ లైన్స్ నడపకముందు ఎఫ్-16 ఫైటర్ జెట్ నడిపాడని చెబుతున్నారు.
ఒకే కుటుంబంలోని పదిమంది....
గల్లంతైన ఎయిర్ ఏషియా విమానంలో 162 మంది ఉన్న విషయం తెలిసిందే. అందులో 155 మంది ప్రయాణీకులు, 7గురు సిబ్బంది ఉన్నారు. అయితే, ఇదే విమానంలో ప్రయాణించవలసిన ఒకే కుటుంబానికి చెందిన పదిమంది ఆలస్యంగా వచ్చినందున విమానం ఎక్కలేదు. ఈ విమానం టేకాఫ్ అయ్యాక కాసేపటికి వచ్చారు. దీంతో వారు విమానంలో ఎక్కలేకపోయారు.
ఆ కుటుంబంలోని పదిమందిలో క్రిస్టినావతి (36) ఒకరు. తమ తల్లి, సోదరులతో కలిసి కుటుంబ సభ్యులమంతా కొత్త ఏడాది వేడుకల కోసం సింగపూర్ వెళ్దామనుకున్నామని, తమలో ఆరుగురు పెద్దవారు, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పింది. ఇదే ఫ్లైట్కు తాము బుక్ చేసుకున్నామని చెప్పింది. తమ ప్రయాణం వివరాల గురించి తమకు ఈ-మెయిల్స్, ఫోన్స్ వచ్చాయని, కానీ తాము చూసుకోలేదని చెప్పింది.
తాము ఏడున్నరకు విమానాశ్రయానికి వచ్చామని, కానీ ఆ విమానం ఐదున్నరకు రీషెడ్యూల్ అయిందని చెప్పారని, దీంతో తాము అధికారుల పైన ఆగ్రహించామని తెలిపింది. తమకు కొత్త టిక్కెట్లు ఇచ్చారని చెప్పింది. కాసేపటికే విమానం గల్లంతైన విషయం తెలిసి, తాము తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నామని చెప్పింది. తాము ఎక్కవలసిన విమానం గల్లంతైన విషయం తెలియగానే తాను షాక్కు గురయ్యానని, ఏడ్చానని చెప్పింది.
తాము అదే విమానంలో ప్రయాణించకుండా దేవుడే చేశాడేమో అని ఆమె చెబుతోంది. అయితే, ఆ విమానం సురక్షితంగా ఉండాలని, అందులోని వారంతా జీవించి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పింది. తాము ప్రతి ఏటా రెండుసార్లు ఎయిర్ ఏషియాలోనే సింగపూర్ వెళ్తామని, ఇదే భద్రమని తాము భావిస్తామని, కానీ ఇప్పుడు తమకు ఆందోళన కలుగుతోందని చెప్పింది.