అమెరికాలో కాల్పులు: చిన్నారితో సహా నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ఓరెంజ్ నగరంలోని ఓ భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఓ చిన్నారితోపాటు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓరెంజ్ నగరంలోని ఓ వాణిజ్య సముదాయంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో నిందితుడికి పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కూడా ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడనేది ఇంకా తెలియరాలేదు. కాగా, రెండు వారాల వ్యవధిలోనే అమెరికాలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇటీవల అట్లాంటాలో వేర్వేరు మసాజ్ పార్లర్లపై గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు.
బాధితుల్లో ఎక్కువ మంది ఆసియన్ అమెరికన్లే ఉన్నారు. ఈ క్రమంలో ఆసియన్ అమెరికన్లపై హింస ఆపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. ఇలాంటి దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications