అమెరికా స్కూల్లో ఫైరింగ్: కొత్తగా చేరిన టీచర్ సాహసం
వాషింగ్టన్: శుక్రవారం నాడు అమెరికాలోని సియాటెల్ నగరంలోని ఓ ఉన్నత పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ టీచర్ సాహసం మరింతమంది ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ టీచర్ హీరో అయ్యారు.
కాల్పులు జరిగిన పాఠశాలలో కొత్తగా చేరిన టీచర్ మెగాన్ సిల్ బెర్గర్ ధైర్యంగా ముందుకు ఉరికి అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేకుంటే మరింత మందిని అతను పొట్టనబెట్టుకునేవాడని ప్రత్యక్షసాక్షులు, పాఠశాల సిబ్బంది తెలిపారు. మెగాన్ చేసిన సాహసాన్ని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు కొనియాడారు.
సిల్ బెర్గర్ కాల్పులు జరుపుతుంటే ధైర్యంగా అడ్డు వెళ్లి కాల్పులు జరుపుతున్న విద్యార్థిని నిలువరించే ప్రయత్నం చేశారు. నిందితుడు తుపాకీని రీలోడ్ చేస్తున్న సమయంలో టీచర్ అతని వద్దకు ఒక్కసారిగా వెళ్లి, అతని చేతిలోని ఆయుధాన్ని తీసుకున్నారు. నిందితుడు తనను తాను కాల్చుకునే ముందు తుపాకీని సదరు టీచర్కు గురి పెట్టాడు.
కాగా, అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ హైస్కూల్లో గల కేఫ్టేరియాలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. విద్యార్థులు గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ఆ విద్యార్థి తన ప్రాణాలు కూడా తీసుకున్నాడు.
ఈ ఘటనలో ముగ్గురి తలలకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నాలుగో బాధితుడు స్వల్పంగానే గాయపడ్డాడు. అతన్ని సియాటిల్లోని హర్బోర్వ్యూ సెంటర్కు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరు యువకులు కాగా, ఇద్దరు యువతులు.
మేరీస్విల్లే సియాటల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షూటర్ తనను కాల్చుకుని మరణించాడని అధికార వర్గాలు చెప్పాయి. అతను కాల్పులకు తెగబడడానికి కారణం ఏమిటనేది తెలియదని అధికారులు రెండు రోజుల క్రితం చెప్పారు. దాడి చేసిన విద్యార్థి రెజ్లింగ్, ఫుట్బాల్ జట్లలో సభ్యుడని చెప్పారు.
ఆ విద్యార్థి లంచ్ సమయంలో కేఫ్టేరియాలోకి ప్రవేశించి తన తరగతి విద్యార్థులపై కాల్పులు జరిపాడని వారన్నారు. అతను వెనక నుంచి వచ్చి ఎనిమిది బుల్లెట్లను కాల్చాడని, వారి వెనక వైవు నుంచి అతను కాల్పులు జరిపాడని వివరించారు.