ట్రంప్ ముందే మరో రచ్చ ? ఈసారి మస్క్-రుబియో మధ్య..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రపంచమంతా పెద్దన్నగా గుర్తిస్తుంటే ఆయన మాత్రం తన సమక్షంలో జరుగుతున్న గొడవల్ని నివారించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పిలిపించి రష్యాతో యుద్దం ఆపేందుకు ప్రయత్నించిన ట్రంప్ కు చేదు అనుభవం తప్పలేదు. ట్రంప్ చెప్పిన ప్లాన్ కు అంగీకరించని జెలెన్ స్కీ భేటీ మధ్యలోనే వాగ్వాదానికి దిగి వెళ్లిపోయారు. ఇప్పుడు అలాంటిదే మరో వివాదం చోటు చేసుకుంది.
తాజాగా ట్రంప్ నిర్వహించిన కేబినెట్ భేటీలో ఆయన విదేశాంగమంత్రి మార్కో రుబియోకూ, డోజ్ ఛీఫ్ గా ఉన్న ఎలాన్ మస్క్ కూ మధ్య ఇలాంటి గొడవే మరొకటి చోటు చేసుకుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థను గాడిన పెడతానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ముందుగా ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు డోజ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లో పెట్టాడు. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యోగులతో పాటు ప్రభుత్వంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ట్రంప్ ఎలాన్ మస్క్ ను పిలిపించి చర్చ పెట్టారు. దీనికి విదేశాంగమంత్రి రుబియో కూడా హాజరయ్యారు.

ఈ చర్చలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ తాను ప్రభుత్వ శాఖల్లో ఎలా ఉద్యోగాల్లో కోత పెడుతున్నారో చెప్పుకొచ్చారు. విదేశాంగమంత్రి రుబియో మాత్రం ఉద్యోగుల్ని తొలగించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన రుబియో తాను వారిని తొలగించకముందే 1500 మంది స్వయంగా తప్పుకున్నారని, ఇప్పుడు మస్క్ చెప్పినట్లు తప్పించాలంటే వారిని మళ్లీ తీసుకుని తొలగించాల్సి ఉంటుందంటూ సెటైర్లు వేశారు. దీనిపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ మాత్రం వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదాన్ని తగ్గించి చూపేందుకు ప్రయత్నించారు. తన ముందు వారిద్దరూ ఘర్షణ పడలేదని చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరూ తన ముందు వాగ్వాదం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అన్నారు.












Click it and Unblock the Notifications