అంగారక గ్రహంపైకి వ్యోమగాములు: మిషన్ మూన్తో నాసా ట్రయల్స్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. సెప్టెంబర్ 3వ తేదీన చంద్రుడిపైకి భారీ రాకెట్ను పంపించనుంది. ఈ నెల 29వ తేదీన ఈ రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి సన్నాహాలు చేపట్టింది గానీ అది విజయవంతం కాలేదు. సాంకేతిక లోపాలు తలెత్తడంతో దీన్ని వాయిదా వేసింది. మళ్లీ ఈ శనివారం రెండోసారి తన ప్రయత్నించనుంది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్)గా పేరు పెట్టిన ఈ రాకెట్ను ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది.
ఈ మొత్తం ప్రాజెక్ట్కు ఆర్టెమిస్ 1గా పిలుస్తోంది నాసా. నాలుగు దశల్లో ఇది పూర్తి చేయాల్సి ఉంది. తొలిదశ ప్రయోగం విజయవంతమైతే 2024లో ఆర్టెమిస్ 2ను చేపడుతుంది. అందులో వ్యోమగాములను స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి పంపించాలని ప్రణాళిక వేసుకుంది. వ్యోమగాములు చంద్రుడి మీద అడుగు మోపరు. వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఆర్టెమిస్ స్పేస్క్రాఫ్ట్ ఎంతవరకూ అనుకూలంగా ఉంటుందనేది పరిశీలించడానికే మలిదశ ప్రాజెక్ట్.
2025లో ఆర్టెమిస్-3 ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపిస్తారు నాసా శాస్త్రవేత్తలు. ఆ వ్యోమగాముల్లో మహిళ కూడా ఉంటారు. చివరిదైన నాలుగో విడత 2030లో ప్రారంభిస్తుంది. 2030 నాటికి అంగారక గ్రహం మీదికి అంతరిక్ష యాత్రికులను పంపించడంలో భాగంగా నాసా శాస్త్రవేత్తలు ఈ మూన్ మిషన్ను చేపట్టారు. ఈ రాకెట్ పొడవు సుమారు 100 మీటర్లు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి అయింది. 10 యూరోప్ దేశాలు దీనికోసం పని చేస్తోన్నాయి.
కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 1 రాకెట్ను శనివారం ప్రయోగించడానికి నాసా శాస్త్రవేత్తలు కసరత్తు మొదలు పెట్టారు. నిజానికి ఈ నెల 29వ తేదీ నాడే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా.. కౌంట్డౌన్ ముగింపు దశలో వాయిదా వేయాల్సి వచ్చింది. రాకెట్ ఇంజిన్ విపరీతంగా వెడెక్కడం, దానిని సాధారణ స్థితికి తీసుకుని రావడంలో తలెత్తిన ఇబ్బందులు, జాప్యం వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ఈ శనివారం దీన్ని నింగిలోకి ప్రయోగించనున్నారు.