కరోనా దెబ్బకు స్మశానాలు హౌజ్ఫుల్.. ఎయిర్ పోర్టును మార్చురీగా మార్చారు..
మహమ్మారి కరోనా రోజురోజుకూ బలపడుతూ వేలమందిని పొట్టనపెట్టుకుంటోంది. యూరప్లో వైరస్ మృత్యువిలయం సృష్టించడంతో అక్కడి స్మశానాల్లో ఖాళీ లేకుండాపోయింది. శుక్రవారం రాత్రి 10.30 వరకు ప్రపంచ వ్యాప్తంగా 26,350 మంది చనిపోగా, అందులో అత్యధికులు యూరప్ దేశాలకు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా ఇటలీలో సుమారు 10 వేల మంది, స్పెయిన్ లో 5వేలు, ఫ్రాన్స్ లో 1700, యూకేలో 759 మంది చనిపోయారు. బ్రిటన్ లో మరణాల రేటు ఎక్కువగా ఉండటం, పాజిటివ్ కేసుల సంఖ్య 15వేలకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎయిర్ పోర్టును మార్చురీగా..
బ్రిటన్ లో గ్రేటర్ లండన్ తర్వాత రెండో అతిపెద్ద కౌంటీ వెస్ట్ మిడ్లాండ్స్లో కొవిడ్-19 మరణాల రేటు కలవరపెట్టే స్థాయికి చేరింది. దీంతో అక్కడి ప్రఖ్యాత బర్మిగ్ హమ్ సిటీలోని బర్మింగ్ హమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కొవిడ్-19 మార్చురీగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఎయిర్ పోర్టులోని కార్గొ టెర్మినల్ దగ్గరున్న భవన సముదాయాలను మార్చురీగా మార్చే ప్రక్రియ శుక్రవారమే మొదలైనట్లు శాండ్వెల్ మెట్రోపాలిటన్ కౌన్సిల్ లీడర్ వసీమ్ అలీ మీడియాకు చెప్పారు.

పకడ్బందీగా ఏర్పాట్లు..
బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోన్న మార్చురీలో కనీసం 1500 మృతదేహాలను భద్రపర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మృతుల కుటుంబీకుల మనోభావాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా, శవాలను పకడ్బందీగా భద్రపరుస్తామని వెస్ట్ మిడ్ లాండ్ పోలీసులు భరోసా ఇస్తున్నారు. నిజానికి ఎయిర్ పోర్టును మార్చురీగా మార్చడం ఎవరికీ ఇష్టం లేనప్పటికీ.. విపత్కర పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు వివరించారు. నాలుగైదు రోజుల్లో పనులు పూర్తయి, మార్చురీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
Recommended Video

హెల్త్ సెక్రటరీకీ పాజిటివ్..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన కొద్ది గంటలకే ఆయన ప్రభుత్వంలో కీలకమైన ఆరోగ్య శాఖకు కార్యదర్శిగా పనిచేస్తున్న మ్యాట్ హాంకాక్ కూడా వైరస్ బారిన పడ్డారు. ‘‘లక్కీగా కరోనా సోకినట్లు ముందే గుర్తించి, సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాను. ప్రస్తుం ఇంట్లో నుంచే పనిచేస్తున్నాను. ఆపత్కాలంలో మనందరం కలిసికట్టుగా ఉందాం''అని హాంకాక్ ట్విటర్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications