ఉత్తరకొరియా ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు, పడిపోయిన రూపాయి విలువ
పసిఫిక్లో అణు ఆయుధాలను పరీక్షించగలమని ఉత్తరకొరియా హెచ్చరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి.
ముంబై : ఉత్తరకొరియా మరోసారి స్టాక్ మార్కెట్లను ముంచింది. కొరియా హెచ్చరికలతో స్టాక్మార్కెట్లు భారీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 32,169 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం తన కీలక మార్కు 10,100ను కోల్పోయి, 71.95 పాయింట్ల మేర నష్టపోతూ 10,049 వద్ద కొనసాగుతోంది.
పసిఫిక్లో అణు ఆయుధాలను పరీక్షించగలమని ఉత్తరకొరియా హెచ్చరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్యూ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు 0.4 శాతం నుంచి 1 శాతం మేర పడిపోతున్నాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7 శాతం చొప్పున డౌన్ అయ్యాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గ్రాఫైట్ ఇండియా, జేపీ అసోసియేట్స్, పీటీసీ ఇండియా, మ్యాట్రిమోనీ.కామ్లు 4 శాతం వరకు నష్టపోయాయి.
అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 82 పైసలు నష్టపోయి 65కి పైన ట్రేడవుతోంది. బంగారం ధరలు కూడా ఎంసీఎక్స్ మార్కెట్లో 216 రూపాయల నష్టంలో 29,558 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి.
భారీగా పడిపోయిన రూపాయి విలువ...
అమెరికా డాలర్తో పోల్చినపుడు రూపాయి విలువ శుక్రవారం నాలుగు నెలల క్రితం స్థాయికి పడిపోయింది. దిగుమతిదారులు, బ్యాంకులు డాలర్ కోసం పోటీ పడటంతో రూపాయి విలువ 31 పైసలు కోల్పోయి, ఒక డాలర్కు రూ. 65.12 పలికింది.
గురువారం రూపాయి విలువ డాలర్కు రూ. 64.81 పలికింది. దేశీయ ఈక్వటీ మార్కెట్లు, విదేశీ నిధుల ప్రవాహం వల్ల రూపాయిపై భారం పడిందని డీలర్లు చెప్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు రేటు వచ్చే డిసెంబరులో పెరిగే అవకాశం ఉన్నట్లు వస్తున్నవార్తల ప్రభావం కూడా రూపాయిపై పడిందని అంటున్నారు.