ఈరోజే భూమికి దగ్గరగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం: ప్రమాదకారే అయినప్పటికీ..
వాషింగ్టన్: ఓ భారీ గ్రహ శకలం.. అది కూడా బూర్జ్ ఖలీఫా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ల చాలా పెద్దది. ఏకంగా గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఈ గ్రహశకలం శనివారం(ఆగస్టు 21) భూమికి అత్యంత సమీపం నుంచి వెళుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. దీన్ని ప్రమాదకరమైన అంతరిక్ష శిలగా పేర్కొంది.
Recommended Video
భూమికి దగ్గరగా అత్యంత వేగంతో దూసుకొస్తున్న గ్రహ శకలం..
అయితే, ఈ గ్రహ శకలం కారణంగా ఎలాంటి హాని ఉండబోదని నాసా తెలిపింది. ఆ గ్రహ శకలానికి '2016 ఏజే193' అని పేరు పెట్టారు. దీని వెడల్పు 4500 అడుగులు. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇది శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో ఆస్టరాయిడ్కు భూమికి మధ్య ఉన్న దూరం.. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 9 రేట్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు.
ఈ గ్రహశకలం ఆగస్టు 21 రాత్రి భూమికి దగ్గరగా రానుందని తెలిపారు. ఈ గ్రహశకలం ఒక మైలు వెడల్పు (1.4 కిలోమీటర్ల వెడల్పు) కంటే తక్కువగా ఉంటుందని అంచనా. సుమారు 4,500 అడుగుల వ్యాసంతో ఉంటుంది. అంటే.. బుర్జ్ ఖలీఫా పరిమాణం కంటే భారీగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్ట్రరాయిడ్.. గంటకు 58,538 మైళ్ల (94,208 కి.మీ/గంటకు) వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే సెకనుకు 16 మైళ్లు (సెకనుకు 26.17 కిమీ)వేగంతో దూసుకొస్తోంది. రాబోయే 65 సంవత్సరాలలో భూమికి అతి దగ్గరగా రానున్న గ్రహశకలం ఇదే కానుంది.
భూమికి గ్రహశకలంతో ప్రమాదం లేదన్న శాస్త్రవేత్తలు
భూమివైపు దూసుకొస్తున్న ఈ భారీ గ్రహశకలం అతి దగ్గరగా వెళ్లనుంది. ఢీకొట్టే పరిస్థితి లేదని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గ్రహశకలం భూమిని దాదాపు 8.9 చంద్రదూరం దాటి వెళుతుందని అంటున్నారు. గ్రహశకలం కక్ష్యను పరిశీలిస్తే.. అది భూమిని ఢీకొనే అవకాశం లేదని ఎర్త్స్కై పేర్కొంది. నాసా ఖగోళ శాస్త్రవేత్తలు రాడార్ ఉపయోగించి ఆగస్టు 20 నుంచి ఆగస్టు 24 మధ్య గ్రహశకలాన్ని గమనాన్ని గమనిస్తున్నారు. కాగా, ఇది కంటికి కనిపించదు.. గ్రహశకలం గమనాన్ని గుర్తించి అధ్యయనం చేసేంత దగ్గరగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2063లో మరోసారి భూమి దగ్గరగా ఈ భారీ గ్రహశకలం
అయితే, ఈ గ్రహశకలం ప్రమాదకరమైనదిగా కూడా హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహశకలం మరోసారి 2063లో భూమికి దగ్గరగా వస్తుందని నాసా కక్ష్య ట్రాక్ ద్వారా అంచనా వేసింది. ప్రస్తుతానికి మన గ్రహానికి ఎలాంటి హాని లేదని స్పష్టం చేసింది. 2016 జనవరిలో హవాయ్లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ సాయంతో ఈ గ్రహ శకలాన్ని గుర్తించారు. ఆ తర్వాత నాసా.. నియోవైన్ అనే వ్యోమనౌక సాయంతో దీన్ని నిశితంగా పరిశీలించింది. ఈ ఖగోళ వస్తువు చాలా చీకటిగా ఉందని, దీని నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు.
గ్రహాల చుట్టే తిరుగుతూ ప్రమాదకరంగా గ్రహ శకలాలు..
కాగా, గ్రహశకలాలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న, రాతి వస్తువులుగా చెబుతారు. గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. గ్రహాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని గ్రహాలు లేదా చిన్న గ్రహాలు అని కూడా పిలుస్తుంటారు. వందల మైళ్ల నుంచి అనేక అడుగుల పరిమాణంలో లక్షలాది గ్రహశకలాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య ఉన్న ప్రధాన ఉల్క బెల్ట్లోనే తిరుగుతుంటాయి. గ్రహశకలాల అన్నింటి ద్రవ్యరాశి భూమి చంద్రుడి కంటే తక్కువగా ఉంటుంది. పరిమాణం ఎలా ఉన్నప్పటికీ గ్రహశకలాలు ప్రమాదకరమే.
గతంలో ఇలాంటి గ్రహశకలాలు భూమిని ఢీకొన్న పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో మన గ్రహం మీదకు మరెన్నో గ్రహశకలాలు దూసుకొచ్చే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉల్క కదలికలను ట్రాక్ చేసే నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ(జేపీఎల్) ప్రకారం.. ఒక గ్రహశకలం మన గ్రహం నుంచి భూమికి సూర్యుడికి దూరం (భూమి-సూర్యుడి దూరం) కంటే 1.3 రెట్లు తక్కువగా ఉంటుంది. దీని మధ్య దూరం సుమారు 93 మిలియన్ మైళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.