కరోనా చికిత్సలో అశ్వగంధ మొక్క-క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమవుతున్న భారత్, బ్రిటన్
మన దేశంలో లభించే ఆయుర్వేద మొక్కలు, ఔషధాలతో కరోనా మహమ్మారిపై చికిత్సకు ఉన్న అవకాశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వశాఖ త్వరలో బ్రిటన్ సహకారంతో వీటిని మరింత వేగవంతం చేయబోతోంది. త్వరలో బ్రిటన్ లోని ముూడు నగరాల్లో అశ్వగంధ పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
Recommended Video
బ్రిటన్ లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ తో జత కలిసిన ఆయుష్ మంత్రిత్వశాఖ మొత్తం 2 వేల మందిపై అశ్వగంధ ప్రయోగించి కోవిడ్ చికిత్సకు ఇది ఎంత వరకూ ఉపయోగపడుతుందో పరీక్షించాలని నిర్ణయించింది. యూకేలోని లీసెస్టర్, బర్మింగ్ హామ్, లండన్ లో ఈ ప్రయోగాలు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయుష్ శాఖ వెల్లడించింది.
ఇండియన్ వింటర్ చెర్రీగా పిలిచే అశ్వగంధ వాడకం వల్ల శక్తి వస్తుందని, ఒత్తిడి తగ్గుతుందని, రోగనిరోధక వ్యవస్ద మెరుగుపడుతుందని పలు పరిశోధనలు తేల్చాయి. దీంతో అశ్వగంధను కోవిడ్ రోగులపై కూడా ప్రయోగించడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుదలను పరీక్షించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ భావిస్తోంది.ఇందుకోసం కోవిడ్ బాధిత దేశాల్లో ఒకటైన యూకేతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం రెండు వేల మందిని రెండు వర్గాలుగా విభజించి వారికి అశ్వగంధ ట్యాబ్లెట్లు ఇవ్వనున్నారు. వీటిని తీసుకున్నాక వారిలో వచ్చే మార్పులు గమనించి ఫలితాలు విడుదల చేయనున్నారు.