ప్యారిస్లో వ్యంగ్య రచనల పత్రికా ఆఫీస్లో కాల్పులు, 12మంది మృతి
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఉన్న ఫ్రెంచి పత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంలో బుధవారం నాడు కాల్పులు జరిగాయి. పత్రికా కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు.
సెంట్రల్ ప్యారిస్లో చార్లీ హెబ్డో వార పత్రిక కార్యాలయం ఉంది. ఇందులోకి చొచ్చుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పత్రిక జర్నలిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
చార్లీ హెబ్డో వ్యంగ్య రచనలకు పేర పొందిన వార పత్రిక. ఈ వార పత్రిక వివాదాలకు కూడా అంతే పేరు పొందింది. గాయపడ్డ పదిమందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాల్పులు జరిగిన పత్రికా కార్యాలయాన్ని ఫ్రెంచ్ అధ్యక్షులు హొలాండే పరిశీలించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఇది ఉగ్రవాదుల చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.
ఓ వర్గానికి చెందిన నేతల పైన వ్యంగ్య కార్డున్లూ వేసినందుకు ఈ కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో పదకొండు మంది చనిపోగా, పదిమంది గాయపడ్డారని, అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంకరుముందు చెప్పారు. అరగంట కింద ఇద్దరు సాయుధులు తుపాకులతో లోపలకు వచ్చారని, ఆ తర్వాత కాల్పుల శబ్ధం వినిపించిందని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు.
కాగా, ఇద్దరు ఉగ్రవాదులు ముసుగు ధరించి వచ్చారు. వీరి సంఖ్య ఇధ్దరి కంటే ఎక్కువగా ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. ఫ్రాన్స్ కమెండోలు లోపలకు ప్రవేశించాయి.
ఏకే 47, రాకెట్ లాంఛర్లతో దాడి
ఉగ్రవాదులు ఏకే 47, రాకెట్ లాంఛర్లు, అత్యాధునిక మిషన్ గన్లతో దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్లోని మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఉగ్రవాదులు పారిపోతూ కూడా కాల్పులు జరిపారట.