పాకిస్తాన్లో వరుస పేలుళ్లు: 10 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్లో మంగళవారం నాడు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు ఆయిల్ ట్యాంకర్లో చిక్కుకు పోయినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన పాక్లోని దక్షిణ బెలూచిస్థాన్లో జరిగింది.
వరుస పేలుళ్లు జరిగాయి. కాలం చెల్లిన నౌకలను విచ్ఛిన్నం చేసే ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్ కారణంగా ఈ పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్లు జరిగిన సమయంలో గద్దాని షిప్ బ్రేకింగ్ యార్డులో వంద మంది కార్మికులు పని చేస్తున్నారు.
వీరిలో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కొంతమంది నౌకలో చిక్కుకుని ఉంటారని, ప్రమాద సమయంలో మరికొందరు సముద్రంలో దూకి ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో అగ్నిమాపక యంత్రాలు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉండవచ్చునని భావిస్తున్నారు. నౌకలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది.