ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలు: గజాపై వైమానిక దాడులు, హమాస్ కమాండర్తోపాటు 20 మంది మృతి
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో పరస్పర దాడులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. రాళ్ల దాడులతో విరుచుకుపడ్డ పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు పవిత్రమైన క్షేత్రాల్లో అల్ మక్సా మసీదు కూడా ఒకటి. రంజాన్ మాసంలో ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు వస్తుంటారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయెల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గజా నుంచి ఇజ్రాయెల్పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. ఈ మొత్తం ఘర్షణలో 20 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులతోపాటు ఓ సీనియర్ హమాస్ కమాండర్ కూడా ఉన్నారు. జెరూసలెంలో జరిగిన ఘర్షణల్లో 305 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. 228 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాలస్తీనియన్ల రాళ్ల దాడుల్లో 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మరో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు కూడా గాయపడ్డారు.
Recommended Video
జెరూసలెం వైపు క్షిపణులను నడిపించడం ద్వారా హమాస్ "రెడ్ లైన్" ను దాటిందని, యూదు రాజ్యం అంతకు రెట్టింపు "బలంగా స్పందిస్తుంది" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.