భారతీయుడిపై జాత్యహంకార దాడి: ఖండించిన ఆస్రేలియా..
ఈ ఘటనపై ఆస్రేలియా హైకమిషన్ తాజాగా స్పందించింది. ఇలాంటి దాడి విచారకరమని, దీన్ని ఖండిస్తున్నామని ప్రకటించింది.
మెల్బోర్న్: కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుప్పల్లికి చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడిపై ఆస్ట్రేలియాలో విద్వేష దాడి జరిగిన సంగతి తెలిసిందే. స్థానికంగా నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్న అతనిపై స్థానిక ఆస్ట్రేలియన్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఆస్ట్రేలియాలో..: భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో ఓ మహిళ సహా ఐదుగురు వ్యక్తులు 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. వారు రెస్టారెంట్ వద్దకు చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. ఈ ఘటనపై ఆస్రేలియా హైకమిషన్ తాజాగా స్పందించింది. ఇలాంటి దాడి విచారకరమని, దీన్ని ఖండిస్తున్నామని ప్రకటించింది.
దాడిలో స్వల్పగాయాల పాలైన భారతీయుడు ప్రస్తుతం రాయల్ హోబర్ట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. దాడిని తీవ్రంగా పరిగణించిన టాస్మానియా పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించారు. భారతీయుడిపై దాడి వెనుక జాత్యహంకార కోణం ఉందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది విచారణలో తేలనుంది.