చనిపోయిన పాప ఫీజు కట్టమన్న స్కూల్: అవాక్కైన పేరంట్స్
న్యూఢిల్లీ: బహ్రెయిన్లో భారత్కు చెందిన కేరళ దంపతులకు విచిత్రమైన పరిస్ధితి ఎదురైంది. వారి ఎనిమిదేళ్ల కుమార్తె జనవరిలో చనిపోతే ఆ పాపకు ట్యూషన్ ఫీజు చెల్లించాలంటూ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక పక్క కూతురు చనిపోయి బాధలో ఉంటే ఇప్పుడు ఈ ఫోన్ కాల్ రావడంతో ఎలా స్పందించాలో అర్ధం కాలేదు.
కేరళకు చెందిన జోఫీ చెరియన్, షైనీ ఫిలిప్ దంపతులు బహ్రెయిన్ లో 27 ఏళ్లుగా ఉంటున్నారు. వారి ఎనిమిదేళ్ల కుమార్తె అబియా శ్రేయా జోఫీ ఈ ఏడాది జనవరిలో చికెన్ ఫాక్స్ కారణంగా మరణించింది. కుమార్తె మరణంతో తల్లి షైనీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు జోఫీ చెరియన్ తెలిపారు.
ఓ తల్లి మనోభావాలను పట్టించుకోకుండా స్కూల్ సిబ్బంది ఇలా ఫోన్ చేయడం చాలా దురదుష్టకరమని జోఫీ చెరియన్ పేర్కొన్నారు. పది రోజుల క్రితం తన భార్యకు ఫోన్ చేసి ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) ఫీజు విషయం చెప్పారని, అప్పుడే తమ కుమార్తె చనిపోయిన విషాయన్ని చెప్పి పేరు తొలగించాలని కోరామని తెలిపారు.
సోమవారం మళ్లీ తమకు ఫోన్ చేసి ఫీజు విషయం అడిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అబియా శ్రేయా జోఫీ చికెన్ ఫాక్స్తో చనిపోయిన విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం క్షమాపణ కోరింది. దీనిపై స్కూల్ ఛైర్మన్ ప్రిన్స్ నటరాజన్ మాట్లాడుతూ పాలనా పరమైన తప్పిదం చోటుచేసుకుని ఉంటుందని వివరించారు.