ఐఎస్ఐఎస్లోకి బెంగళూరు టెక్కి: ముగ్గురి దుర్మరణం
న్యూఢిల్లీ: బెంగళూరు పోలీసు అధికారులు పెద్ద షాక్ కు గురైనారు. బెంగళూరు నగరం నుండి ఇద్దరు యువకులు, పక్క జిల్లా నుండి మరొ యువకుడు సిరియా చేరుకుని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు మద్దతుగా యుద్దం చేసి మరణించారనే సమాచారంపై విచారణ మొదలు పెట్టారు.
బెంగళూరు నగరంలోని కాక్స్ టౌన్ కు చెందిన ఫయాజ్ మసూద్, శివాజీనగర నివాసి ఊమర్ సుభాన్, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని విజయపుర నివాసి అబ్దుల్ ఖద్దుస్ టర్కి అనే ముగ్గురు సిరియాలో యుద్దం చేస్తు మరణించారని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.
కాక్స్ టౌన్ కు చెందిన ఫయాజ్ మసూద్ కతార్ లో ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. గత సంవత్సరం ఇతను బెంగళూరు వచ్చి పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకుని వెళ్లాడు. శివాజీనగర నివాసి ఊమర్ సుభాన్ యెమెన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసేవాడు.
2013లో వీరిద్దరు విజయపురకు చెందిన అబ్దుల్ ఖద్దుస్ టర్కితో కలిసి సౌదీ చేరుకున్నారు. అక్కడి నుండి నకిలీ పాస్ పోర్టులు ఉపయోగించి బాగ్దాద్ చేరుకున్నారని, తరువాత సిరియాలో ఐఎస్ఐఎస్ కు మద్దతుగా యుద్దం చేస్తున్నసమయంలో మరణించారని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించాయి.
విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసు అధికారులు కాక్స్ టౌన్, శివాజీ నగర, విజయపుర చేరుకుని ఆ ముగ్గురు కుటుంబ సభ్యులను విచారణ చేశారు. అయితే ఉద్యోగరీత్యా వారు వెళ్లారని, తరువాత మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
ఐఎస్ఐఎస్ కు మద్దతుగా వారి అరాచకాలను ట్విట్ చేస్తున్నాడని ఆరోపిస్తు బెంగళూరులో మెహ్దీ అనే టెక్కిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు తో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఉన్న కొందరు ముస్లిం యువకులు ఐఎస్ఐఎస్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని మెహ్దీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.