బిగ్ షాక్ ; బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. ఎంత మంది చనిపోయారంటే ???
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. నగరంలోని ఎయిర్పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ప్రజా రవాణా బస్సును ఢీకొనడంతో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన థాయ్లాండ్ ఉప రవాణా శాఖ మంత్రి సిరిపోంగ్ అంగ్కసాకుల్కియాట్ కీలక వివరాలను వెల్లడించారు. "మృతదేహాలన్నీ బస్సులోనే లభించాయి. బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు" అని ఆయన తెలిపారు. బస్సు రైల్వే ట్రాక్పైనే ఆగిపోయిందా లేదా రైల్వే గేట్లు సరిగా పనిచేయలేదా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ప్రమాద తీవ్రతను కళ్ళకు కట్టాయి. రైల్వే క్రాసింగ్ వద్ద వాహనాలు నిలిచి ఉండగా, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఆరెంజ్ రంగు బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్ర ప్రభావంతో బస్సుతో పాటు పక్కనే ఉన్న పలు వాహనాలు కూడా ట్రాక్ల వెంట లాగుకెళ్లాయి. అనంతరం బస్సుకు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో అక్కడున్న బైక్ రైడర్లు గాల్లోకి ఎగిరిపడి రోడ్డుపై పడిన దృశ్యాలు కూడా ఈ వీడియోలలో స్పష్టంగా కనిపించాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాత సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
థాయ్లాండ్ మీడియా కథనాల ప్రకారం, సదరు గూడ్స్ రైలు దక్షిణ చాచోయెంగ్సావో ప్రావిన్స్ నుంచి బ్యాంకాక్లోని బాంగ్ సూయే ప్రాంతానికి వెళ్తోంది. ప్రమాదానికి గురైన బస్సు బ్యాంకాక్ తూర్పు శివార్ల నుంచి నగర కేంద్రానికి నడిచే సర్వీస్గా గుర్తించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో బ్యాంకాక్ సమీపంలోనే ఇలాంటి ఓ ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల కోసం ఉపయోగించే భారీ క్రేన్ ఓ ప్రయాణికుల రైలుపై కూలిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటనపై కూడా థాయ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications