బంగ్లాదేశ్ బ్లాగర్ దారుణ హత్య
ఢాకా: ఇంటిలోకి చొరబడిన దుండగులు బ్లాగర్ ను అతి దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో జరిగింది. గుర్తు తెలియని దుండగుల చేతిలో నిలోయ్ చక్రబర్తి నీల్ (40) అనే వ్యక్తి హత్యకు గురైనాడు.
ఢాకాలోని ఉత్తర గోర్హన్ ప్రాంతంలోని ఒక అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తులో నిలోయ్ చక్రబర్తి అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం చక్రబర్తి స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. వారిద్దరు కలిసి హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు అయిన తరువాత నలుగురు దుండగులు అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తులోకి వెళ్లారు. చక్రబర్తి ఫ్లాట్ ఎక్కడ అని అక్కడ ఉన్న వారిని అడిగారు. తరువాత చక్రబర్తి ఫ్లాట్ లోకి చొరబడ్డారు. చక్రబర్తి భార్య, అతని స్నేహితుడిని పక్కకు నెట్టేశారు.
కత్తులు తీసుకుని చక్రబర్తి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతను అక్కడే మరణించాడని సీనియర్ పోలీసు అధికారి ముస్తఫిజర్ తెలిపారు. చక్రబర్తి లౌకికవాద బ్లాగర్, 1971 యుద్ద నేరస్తులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న జనజాగరణ్ మంచ్ సభ్యుడిగా పని చేస్తున్నాడు.
చక్రబర్తిని హత్య చేసింది ఇస్లామిక్ మిలిటెంట్లు అని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇదే సంవత్సరం నలుగురు బ్లాగర్ లు దారుణ హత్యకు గురైనారు.