బంగ్లాలో ఘోరం: హిందూ పూజారి తల నరికేశారు
ఢాకా: బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదుల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా, 70ఏళ్ల ఓ హిందూ పూజారి సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదులు గత కొన్ని నెలలుగా ఇతర మత గురువులను, లౌకికవాద రచయితలను, బ్లాగర్లను, హక్కుల కార్యకర్తలను హతమార్చుతున్న సంగతి తెలిసిందే.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జేనిదా జిల్లాలోని నోల్దంగా గ్రామంలో ఆనంద గోపాల్ గంగూలీ అనే పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పూజారిని హత్య చేసింది ఇస్లామిక్ ఉగ్రవాదులేనని భావిస్తున్నారు.

తల నుంచి మొండెం వేరు చేసి అతి కిరాతకంగా ఆ పూజారిని చంపేశారు. నిర్మానుష్య ప్రాంతంలో పొలాల వద్ద ఆయన మృతదేహాన్ని పడేశారు. ఆయన ఉదయం పూజ కోసం వెళ్తుండగా ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత పది వారాల్లో దాదాపు పది మంది హత్యలకు గురయ్యారు. ఇటీవల ఓ బౌద్ధసన్యాసిని, యూనివర్సిటీ ప్రొఫెసర్ను, గే హక్కుల కార్యకర్తలను దారుణంగా చంపేశారు.












Click it and Unblock the Notifications