22 మంది మృతి: క్షమించమని అడిగిన ఒబామా
న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్లోని ఓ మెడికల్ క్లినిక్పై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా క్షమాపణలు తెలిపారు. ఆప్గనిస్థాన్లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' అంతర్జాతీయ సంస్థ ప్రెసిడెంట్ జొయెన్నె లియుతో బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు.
పొరపాటున ఈ దాడి జరిగిందని, అందుకు క్షమించాలని ఒబామా కోరినట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జోష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని, మిలటరీ చర్యలను పర్యవేక్షిస్తామని చెప్పారు.
ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా పొరపాటున ఓ మెడికల్ క్లినిక్పై అమెరికా వైమానిక దళాలు దాడి చేశాయి. శనివారం జరిగిన ఈ వైమానిక దాడుల్లో కుందుజ్లో ఉన్న ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది ఆప్గన్ పౌరులు చనిపోయారు.
తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆప్గన్లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్ బెల్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఆప్గన్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్ బెల్ చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుందుజ్లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్లో భాగంగా ఆప్గన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్ బెల్ చెప్పారు.