అది బెస్ట్ డెసిషన్: స్వయంగా తాలిబన్ల చేతిలో ఆప్ఘనిస్తాన్: జాతిని ఉద్దేశించి బైడెన్ ప్రసంగం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరువాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన మరుసటి రోజే ఆయన దేశ ప్రజల ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేసిన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడానికి గల కారణాలను వివరించారు.
Recommended Video

తాలిబన్ల జాడ లేకుండా చేసినా..
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల జాడ లేకుండా చేశాయి.. అమెరికా, నాటో బలగాలు. వారిని తిరిమి కొట్టాయి.. అణచి వేశాయి. రెండు దశాబ్దాల పాటు ఆ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాయి. ఎప్పుడైతే అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం ఆరంభించిందో.. ఆ క్షణం నుంచే తాలిబన్లు తమ ఉనికిని మళ్లీ చాటుకుంటూ వచ్చారు. అమెరికా సైనికులు వెనక్కి వెళ్తోన్న కొద్దీ.. తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోయారు. చివరికి- దేశం మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు.

అమెరికాపై విమర్శలు
అమెరికా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడం వల్ల తాలిబన్లు విరుచుకుపడ్డారని, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభానికి అగ్రరాజ్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలోనూ జో బైడెన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అమెరికా తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ బ్రిటన్ సైతం వ్యాఖ్యానించింది. వాటన్నింటినీ పట్టించుకోలేదు అమెరికా. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.

బలగాల ఉపసంహరణ పూర్తి..
ఈ పరిణామాల మధ్య అమెరికా.. తన సైనిక బలగాలను ఆప్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంది. మంగళవారం నాటికి.. అంటే ఆగస్టు 31వ తేదీ నాటికి బలగాల ఉపసంహరణను పూర్తి చేస్తామని ఇదివరకే ప్రకటించింది అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్. దీనికి ఇంకా గడువు మిగిలి ఉండగానే.. ఆ ప్రక్రియను ముగించేసింది. తాలిబన్లు ఆఫ్ఘన్ను పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత 17 రోజుల్లో తరలింపు కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకుంది.

నిర్ణయాన్ని సమర్థించుకున్న బైడెన్..
ఈ విమర్శలన్నింటికీ జో బైడెన్ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం అనేది అత్యుత్తమ నిర్ణయంగా అభివర్ణించారు. సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడానికి మించి అమెరికా ముందు మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదని వ్యాఖ్యానించారు. మంచి నిర్ణయంగా.. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఆయన పునరుద్ఘాటించారు. అంతకంటే మరో మార్గం లేదని పేర్కొన్నారు.

ఆ బాధ్యత నాదే..
ఆఫ్ఘనిస్తాన్లో తమ దేశ సైన్యాన్ని మోహరింపజేయడం వల్ల రోజూ 300 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందని జో బైడెన్ స్పష్టం చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు అదనపు వ్యయాన్ని భరిస్తూ వచ్చామని అన్నారు. సైన్యాన్ని బలోపేతం చేసుకోకపోవడం ఆఫ్ఘనిస్తాన్ బలహీనత అని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ను వీడాలనే నిర్ణయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నానని చెప్పారు. దీనికి కారణాలను వెదకదలచుకోలేదని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొంటామని అన్నారు. 17 రోజులుగా నిరంతరాయంగా, విరామం లేకుండా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 1,20,000 అమెరికా పౌరులు, ఆఫ్ఘనిస్తానీయులు, ఇతర దేశాల వారిని తరలించామని బైడెన్ తెలిపారు.

యుద్ధం కొనసాగించడమా.. ముగించడమా
ఒక యుద్ధం ఆరంభించినప్పుడు.. దాన్ని ఎక్కడో ఓ చోట ముగించేయాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితిని తాను ఎదుర్కొన్నానని జో బైడెన్ అన్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. అందుకే- సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకోవడం కంటే మరో మార్గం లేదనే నిర్ధారణకు వచ్చానని చెప్పారు. ఇలాంటి సమస్యను, సందర్భాన్ని ఎదుర్కొన్న అమెరికా నాలుగో అధ్యక్షుడిని తానేనని పేర్కొన్నారు. తనకంటే ముందు పని చేసిన అధ్యక్షులు కూడా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోయారని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

అష్రఫ్ ఘనీ పెద్ద తప్పు..
తాలిబన్ల ఆక్రమణ మొదలైన తరువాత అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లి.. పెద్ద తప్పు చేశారని జో బైడెన్ విమర్శించారు. ఆయన దేశం విడిచి వెళ్లడంతో అరాచకత్వం పెరిగిందని, అల్లర్లు చెలరేగడానికి ప్రధాన కారణమైందని అన్నారు. ఘనీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. స్వయంగా తన చేతులతో తన దేశాన్ని ఆయన తాలిబన్ల చేతుల్లో పెట్టారని వ్యాఖ్యానించారు. తమకు ఎదురు లేకుండా పోవడంతో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారని 2001 నాటి కంటే ఇప్పుడు మరింత బలోపేతం అయ్యారని చెప్పారు.

ఉగ్రవాదంపై పోరు కొనసాగింపు..
తాలిబన్లు ఇదివరకటి కంటే బలోపేతం కావడం ప్రమాదకరమని బైడెన్ అన్నారు. తమ దేశ గడ్డ మీద ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, చిట్టచివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకూ అప్రమత్తంగా ఉంటామని అన్నారు. ఈ విషయంలో మిగిలిన దేశాలు, తమతో కలిసి రావాలని బైడెన్ పిలుపునిచ్చారు. ఆప్ఘనిస్తాన్లో సాధారణ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ తక్షణ ప్రమాదకరంగా పరిణమించిందని అన్నారు.

ఆఫ్ఘన్ ఒక్కటే కాదు..
సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయంతో నష్టపోయింది ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే కాదని.. అమెరికా కూడా నష్టపోయిందని జో బైడెన్ పేర్కొన్నారు. మానసికంగా అలసిపోయిందని చెప్పారు. 20 సంవత్సరాల పాటు పరాయి దేశంలో తాము సేవలను అందించామని, దీనికోసం మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేశామని అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఇంకా అక్కడే కొనసాగడం సరికాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. ఆప్ఘనిస్తాన్ సొంతంగా తన సైన్యాన్ని, ఆర్మీని బలోపేతం చేసుకోకపోవడం వల్ల నష్టపోయిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications