భారతీయులకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్-మరో 18 నెలల పాటు ఆ వీసాల పొడిగింపు
భారత్ తో పాటు వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో సేవలందిస్తున్న వలస వీసాదారులకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా వర్క్ పర్మిట్లను మరో 18 నెలల పాటు పొడిగించింది. వివిధ దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలోని పలు రంగాల్లో సేవలందిస్తున్న వృత్థి నిపుణులకు ఈ నిర్ణయం భారీ ఊరటనివ్వబోతోంది.
అమెరికా సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం వృత్తి నిపుణులకుటుంబాలతో పాటు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న పలుకుటుంబాలు, వ్యక్తులకు కూడా ఊరట లభించబోతోంది. వీరందరికీ వర్క్ పర్మిట్లను వివిధ కేటగిరీల్లో 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని అమెరికాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.
అమెరికాలో ప్రస్తుతం ఎంప్లాయ్ మెంట్ ఆధరేజైషన్ కార్డు కలిగి ఉన్న వారు దాని గడువు ముగిసిన 180 రోజుల వరకూ దేశంలోనే ఉండేందుకు వీలుంది. దీన్ని తాజాగా 540 రోజుల పాటు అంటే 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు బైడెన్ సర్కార్ తెలిపింది. ప్రస్తుతం అమెరికా పౌరసత్వానికి గుర్తింపుగా ఇచ్చే గ్రీన్ కార్డులతో పాటు ఈ వర్క్ పర్మిట్ల రెన్యువల్ కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏకంగా వీటికి పొడిగింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో అమెరికాలో ఇప్పటికే వలస వీసాతో కొనసాగుతూ ఉద్యోగాలు చేస్తున్న వారు మరికొంత కాలం పాటు అక్కడే ఉండేందుకు వీలు కలుగుతుంది. దీంతో వృత్తి నిపుణుల కొరత తీరుతుందని భావిస్తున్నారు. అలాగే వలసదారుల కుటుంబాలకు కూడా ఊరట లభిస్తుందని బైడెన్ సర్కార్ ప్రకటించింది.
బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని 87 వేల మంది వలసదారులకు తక్షణ లబ్దితో పాటు 4.2 లక్షల కుటుంబాలకు ఉద్యోగ భద్రత లభిస్తుందని తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది భారతీయులే ఉండటంతో వారికి బైడెన్ సర్కార్ భారీ ఊరటనిచ్చినట్లయింది.