Covid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టు
ఏడాదిన్నరకు పైగా భూగోళాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 35లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. గురువారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17 కోట్లకు చేరింది. 6లక్షలకుపైగా మరణాలు, 3.4కోట్ల కేసులతో అమెరికా కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతున్నది. అన్ని దేశాలూ వైరస్ విలయంలో చిక్కుకోగా, కరోనా జన్మస్థలమైన చైనాలో మాత్రం రెండో వేవ్ గానీ, వేరియంట్లుగానీ లేకుండా సాధారణ స్థితిలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
Recommended Video
దీంతో కొవిడ్ పుట్టుకపై సర్వత్రా అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వూహాన్ ల్యాబ్ రిపోర్టులు అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..
కొవిడ్ పుట్టుకపై 90 రోజుల్లో
చైనాలోని వూహాన్ నగరం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ పై తొలి నుంచీ అనుమానాలున్నాయి. అక్కడి వైరాలజీ ల్యాబ్ లో దాన్నొక జీవ ఆయుధంగా తయారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తగా, నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, సదరు ఆరోపణలను కొట్టేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే డబ్ల్యూహెచ్ఓ క్లీన్ చిట్ తర్వాత కూడా చైనాపై అనుమానాల పరంపంర ఆగలేదు.
వూహాన్ ల్యాబ్ కు సంబంధించి తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీంతో అమెరికా ప్రభుత్వం నేరుగా కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై ఫోకస్ పెట్టింది. వైరస్ పుట్టుక, దాని మూలాలకు సంబంధించిన అంశాలను 90 రోజుల్లోగా దర్యాప్తు చేయాలంటూ అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలకు అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
చైనా సహకరించాలన్న బైడెన్
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ మూలాలపై రాబోయే మూడు నెలల్లోగా దర్యాప్తుచేసి నివేదిక సమర్పించాలని ఇంటెలిజెన్స్ సంస్థలను ఆదేశించిన జో బెడన్.. ఈ ప్రక్రియకు సహకరించాల్సిందిగా చైనాను సైతం అభ్యర్థించారు. మహమ్మారి మూలాల గురించి అంతర్జాతీయ పరిశోధకులకు సహకరించాలని చైనాకు పిలుపునిచ్చారు.
చైనాలో మొదట ఉద్భవించిన కరోనా వైరస్ జంతు వనరు నుంచి వచ్చిందా లేదా ప్రయోగశాల ప్రమాదం నుంచి వచ్చినదా నివేదించాలని బిడెన్ ఏజెన్సీలను ఆదేశించారు. ఇంటెలిజెన్స్ వర్గాలలో ఎక్కువమంది చెబుతున్న సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయన్నారు. కరోనా మూలాలను ఛేదించే క్రమంలో అమెరికా జాతీయ ప్రయోగశాలలు కూడా పాలుపంచుకోవాలన్నారు.
వూహాన్ ల్యాబ్ గుట్టు రట్టుతో..
కరోనా పుట్టుకకు సంబంధించి చైనాలోని వూహాన్ ల్యాబులో చోటుచేసుకున్న సంఘటనలివంటూ అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ ఇటీవల కొన్ని సంచలన కథనాలు రాసింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్లో అనారోగ్యానికి గురయ్యారని, తమకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని వారు కోరారని అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ ఒక రిపోర్ట్ ప్రచురించింది.
వుహాన్ ల్యాబ్లో జబ్బు పడిన పరిశోధకుల సంఖ్య, వారు అనారోగ్యానికి గురైన సమయం, ఆస్పత్రిలో వారు పొందిన చికిత్సకు సంబంధించిన విషయాలను ఈ నిఘా రిపోర్టులో వివరించారు. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనావైరస్ వ్యాపించిందని వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఈ నిఘా రిపోర్టులోని సమాచారం బలమైన ఆధారంగా నిలుస్తుందని భావిస్తున్నారు. కరోనావైరస్ మూలాలకు సంబంధించి తదుపరి విచారణపై చర్చించడానికి డబ్ల్యుహెచ్ఓ సమావేశం కానుంది. దానికి ఒక్క రోజు ముందు ఈ రిపోర్ట్ వెల్లడైంది.