ఘోర ప్రమాదం: బస్సులో చెలరేగిన మంటలు, చిన్నారులతోపాటు 45 మంది మృతి
సోఫియా: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
బల్గేరియా రాజధాని సోఫియా నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఓ బస్సులో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో అందులోని 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
అంతా నిద్రలో ఉండటంతో మరణాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. బస్సులో మృతదేహాలు ఓ కుప్పగా మారాయని, బూడిదయ్యాయని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోన్ తెలిపారు. ఇలాంటి భయానక ఘటనను ఇంతకుముందు చూడలేదన్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ తప్పిదం కారణంగా ఈ ఘోరం చోటు చేసుకుందా? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్ యానెవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.