బాత్ రూంలో కెమెరాలు.. సెల్లో కూడా.. మరియం నవాజ్ సంచలన ఆరోపణలు..
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరీ షుగర్ మిల్స్లో జరిగిన అవకతవకలపై నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మరియం జైలులో ఉండగా.. తనపై నిఘా ఉంచారని.. కెమెరాలు అమర్చారని కామెంట్స్ చేశారు. ఇదీ చర్చానీయాంశమైంది.
తన జైలు సెల్లో అధికారులు కెమెరాలు అమర్చారని మరియం ఆరోపించారు. అక్కడితో వదిలేయలేదని చెప్పారు. చివరికీ బాత్ రూంలో కూడా కెమెరాలు పెట్టారని పేర్కొన్నారు. వారి చర్యలతో తాను తీవ్ర ఇబ్బందికి గురవుతున్నానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తాను రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చానని మరియం తెలిపారు. జైలులో మహిళను నిర్భందానికి గురిచేయడం ఏంటీ అని... ప్రభుత్వంపై మరియం విరుచుకుపడ్డారు.
తన తండ్రి ఎదుటనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చారని మరియం గుర్తుచేశారు. తనకే రక్షణ లేకుంటే ఇక సాధారణ వారి పరిస్థితి ఏంటీ అని అడిగారు. పాకిస్తాన్లో ఏ మహిళకు సరైన రక్షణ లేదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా మహిళ అంటే చిన్నచూపు ఉండొద్దని.. పాకిస్తాన్లో అస్సలు ఉండొద్దని అభిప్రాయపడ్డారు.
అయితే పాకిస్తాన్లో కొలువుదీరిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని మిలిటరీ సాయంతో కూల్చి.. రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని మరియం అనుకొన్నారని జియో చానెల్ రిపోర్ట్ చేసింది. దేశంలోని వ్యవస్థలపై తాను కోపంగా లేనని మరియం అన్నారు. తాను కేవలం అణచివేతపై మాత్రం పోరాడుతున్నానని పేర్కొన్నారు.