అక్కడ ఏం జరుగుతోంది: ప్రధాని సంచలన నిర్ణయం: 50 ఏళ్ల తరువాత తొలిసారిగా
ఒట్టావా: కెనడాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు చెలరేగాయి. లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది వాహనాలు, ట్రక్కుల ద్వారా ఆందోళనకారులు రాజధానిని చుట్టుముట్టారు. కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ సైతం వారిని నిలువరించలేకపోయింది. భారీ ట్రక్కులతో వారు రాజధానిలోకి ప్రవేశించారు.
రోజులు గడుస్తున్నా..
కరోనా వ్యాక్సినేషన్. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జస్టిన్ ట్రుడో ప్రభుత్వం తప్పనిసరి చేయడం, దేశ ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. కోవిడ్ ప్రొటోకాల్స్ను పాటించి తీరాలని పేర్కొంది. దీన్ని నిరసిస్తూ కిందటి నెలలో చెలరేగిన ఈ ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోన్నాయి. రోజులు గడుస్తున్నా.. తగ్గుముఖం పట్టట్లేదు.
కఠిన నిర్ణయం..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని విధించారు. ఎమర్జెన్సీ చట్టాన్ని తక్షణమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమర్జెన్సీలో భాగంగా పోలీస్, భద్రతా విభాగానికి అదనపు అధికారాలను కల్పించినట్లు చెప్పారు. పార్లమెంట్ హిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో శాంతిభద్రతలు కట్టు తప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక ఆంక్షలు
చట్టాలను అమలు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలించట్లేదని అందుకే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని చెప్పారు. ఎమర్జెన్సీలో భాగంగా కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలను కూడా అమల్లోకి వచ్చినట్లు ట్రూడో పేర్కొన్నారు. దేశ ప్రజలకు భద్రత కల్పించడానికి, వ్యవస్థల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.
1970 తరువాత..
50 సంవత్సరాల తరువాత కెనడాలో అత్యవసర పరిస్థితిని విధించడం ఇదే తొలిసారి. 1970లో అప్పటి ప్రధానమంత్రి, జస్టిన్ ట్రూడో తండ్రి పియెర్రె ట్రూడో హయాంలో తొలిసారిగా ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఆయన కుమారుడు మళ్లీ దీన్ని ప్రయోగించారు. అత్యయిక పరిస్థితిని విధిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ పార్లమెంట్ వారం రోజుల్లోగా ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం పొందలేకపోతే- అది తొలగిపోయినట్టే భావించాల్సి ఉంటుంది.
అజ్ఞాతంలోకి
ఈ ఆందోళనలు తీవ్రతరమైన ఒకదశలో జస్టిన్ ట్రూడో అజ్ఞాతంలోకి సైతం వెళ్లిన విషయం తెలిసిందే. భారీ ట్రక్కులతో ఆందోళనకారులు రాజధానిని చుట్టుముట్టడంతో భద్రత బలగాలు.. ట్రుడో, ఆయన కుటుంబ సభ్యులను అజ్ఞాతంలోకి తరలించాయి. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పక్కా సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
కోవిడ్ ప్రొటోకాల్స్ నుంచి స్వేచ్ఛ కోసం..
కోవిడ్ ప్రొటోకాల్స్ను ట్రూడో ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ కెనడాలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసనకారులు భారీ ట్రక్కులతో ఒట్టావాలో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అక్కడే టెంట్లు వేసుకున్నారు. కరోనా ఆంక్షల నుంచి స్వేచ్ఛ కావాలంటూ నినదించారు. కోవిడ్ ప్రొటోకాల్స్, మాస్కుల ధారణ, లాక్డౌన్ల నుంచి తమకు విముక్తి కల్పించాలంనే బ్యానర్లను ప్రదర్శించారు. విమానాశ్రయం, సరిహద్దులకు వెళ్లే మార్గాలను మూసివేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అత్యయిక పరిస్థితి విధించిందక్కడి ప్రభుత్వం.