మోడీ ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు 50 శాతమే: ప్రముఖ ఆర్థిక వేత్త రుచిర్ శర్మ
నరేంద్ర మోడీ తిరిగి 2019లో ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 2017లో జరిపిన సర్వేలో ప్రధానిగా మోడీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం 99శాతం ఉండగా... అది 2019కి 50 శాతానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక విశ్లేషకులు రుచిర్ శర్మ వెల్లడించారు. ఇందుకు కారణం విపక్షాలన్నీ ఏకం కావడమేనని ఆయన చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఆనాడు విపక్ష పార్టీగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు మిగతా పార్టీలతో జతకట్టింది. అదే ఫార్ములా ప్రస్తుత విపక్ష పార్టీ కాంగ్రెస్ అనుసరిస్తోందని గుర్తు చేశారు.
2019 ఎన్నికలు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని శర్మ అంచనా వేశారు. శర్మ స్వతహాగా ఆర్థికవేత్తే అయినప్పటికీ ప్రపంచ రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ప్రత్యేకించి భారత రాజకీయ ముఖచిత్రంపై మంచి పట్టుఉంది. ఆయన ఆర్థిక వ్యవస్థపై రాసిన పుస్తకం "డెమొక్రసీ ఆన్ రోడ్"ఫిబ్రవరిలో విడుదల కానుంది. 1990 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికలను శర్మ దగ్గర నుంచి పరిశీలించారు. 2004 ఎన్నికల సమయంలో నాటి వాజ్పేయి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడం విపక్ష పార్టీలపై సానుకూలత ఏర్పడటం లాంటివి జరగడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ప్రస్తుతం మోడీ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉందని శర్మ అభిప్రాయపడ్డారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ గురించి కూడా శర్మ ఆయన ప్రస్తావించారు. 80లోక్సభ స్థానాలున్న ఉత్తర్ప్రదేశ్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తాయని చెప్పారు. ఈ కలయిక జరగకుంటే బీజేపీని ఎదుర్కోవడం కష్టమే అని అన్నారు. ఇప్పటికీ ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలు కులం ఆధారంగానే జరుగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా పొత్తులు కులం ఆధారంగానే జరుగుతున్నాయని చెప్పారు. అగ్రకులం వారు బీజేపీకి ఓటువేస్తే దళితులు మాయావతి పార్టీకి ఓటువేస్తారని ఆయన చెప్పారు.