శ్రీలంక పశ్చిమ తీరంలో ఘోర ప్రమాదం-మునిగిపోయిన నౌక-సముద్ర జలాల్లోకి టన్నులకొద్ది కెమికల్స్,ఇంధనం?
శ్రీలంక పశ్చిమ తీరంలో ఓ భారీ నౌక మునిగిపోయింది. టన్నులకొద్ది కెమికల్ లోడ్తో వెళ్తున్న ఆ కార్గో నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది. గత నెల 20వ తేదీన ఈ ప్రమాదం సంభవించగా... అప్పటినుంచి క్రమంగా అది మునిగిపోవడం మొదలైంది. నౌక సముద్రంలో మునిగిపోకుండా శ్రీలంక నౌకాదళం చేపట్టిన చర్యలేవీ ఫలించలేదు. నౌకలో ఉన్న 25 మంది సిబ్బందిని రక్షించగలిగారు. శ్రీలంకలో చోటు చేసుకున్న అత్యంత ఘోర సముద్ర విపత్తుల్లో ఇది కూడా ఒకటని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
Recommended Video
గుజరాత్ నుంచి బయలుదేరిన నౌక
సింగపూర్-రిజిస్టర్డ్ ఎంవీ ఎక్స్-ప్రెస్ పెర్ల్లోని 1486 కంటైనర్లలో 25 టన్నుల నైట్రిక్ యాసిడ్, ఇతర 325 మెట్రిక్ టన్నుల ఇంధనం ఉన్నది. ఇప్పుడీ కెమికల్స్,ఇంధనం సముద్రంలో కలవనుండటంతో శ్రీలంక ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే 15న ఈ కార్గో నౌక గుజరాత్లోని హజీరా పోర్టు నుంచి కొలంబోకి బయలుదేరింది. నౌకలోని కంటైనర్లలో కెమికల్స్తో పాటు సౌందర్య సాధనాలకు సంబంధించిన ముడి పదార్థాలు ఉన్నాయి. కొలంబోకి వాయువ్య దిశగా 9.5 నాటికల్ మైళ్ల(18కి.మీ) దూరంలో ఉన్నప్పుడు నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో నౌకలోని కంటైనర్లు సముద్రంలోకి జారిపోవడం మొదలైంది. అప్పటినుంచి శ్రీలంక నావికా దళం ఎన్ని చర్యలు చేపట్టినా నౌక మునిగిపోకుండా అడ్డుకోలేకపోయారు.
చేపల వేటపై నిషేధం...
పేలుడు సంభవించి నైట్రిక్ యాసిడ్తో పాటు ఇతర ఇంధనాలకు మంటలు అంటుకోవడంతో ఓడ మూడు ముక్కలైనట్లు తెలుస్తోంది.నౌకలో ఉన్న రసాయనాలు సముద్రంలో కలవడంతో... శ్రీలంక సముద్ర తీరంలో 80కి.మీ వరకు మత్స్య వేటను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది.నౌకలో పేలుడుతో ఓడ నుంచి పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలు శ్రీలంక సముద్ర తీర ప్రాంతాల్లో పేరుకుపోయాయి. దీంతో వందల మంది నావికా సిబ్బందిని అక్కడ మోహరించి దాన్ని తొలగిస్తున్నారు.
సముద్ర జలాల్లో ఇంధనం..?
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహాయక చర్యలో శ్రీలంక నౌకాదళంతోపాటు భారతదేశం నుంచి నాలుగు పడవలు, మూడు నౌకలు పాల్గొన్నాయి. ఇది మానవ కారక విపత్తేనని శ్రీలంక మెరైన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ ఛైర్మన్ ధర్శణి లహందపురా పేర్కొన్నారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని... దేశంపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. కంటైనర్లలో ఉన్న ఇంధనం ఇప్పటికైతే సముద్ర జలాల్లో కలిసినట్లు ఎక్కడా గుర్తించలేదని అన్నారు. ఒకవేళ సముద్ర జలాల్లో ఇంధనం కలిస్తే అత్యంత వినాశకర పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు. ఇంధనం సముద్ర జలాల్లో కలవకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
Situation Update: Latest videos of the "X-PRESS PEARL" vessel. Footage was captured by the SLAF Bell 212 a short while ago (02 June 2021).#MVXPressPearl pic.twitter.com/4GznxCTuXy
— Sri Lanka Air Force (@airforcelk) June 2, 2021