ట్రంప్ వ్యవహారంపై రంగంలో దిగిన ఐక్యరాజ్యసమితి..!!
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంజా విసిరారు. వైమానిక దాడులతో విరుచుకుపడ్డారు. రాజధాని కారకాస్ పై బాంబులను కురిపించారు. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించారు. అక్రమ మాదక ద్రవ్యాలను తమ దేశంలోకి పంపిస్తోందనే ఆరోపణలపై అమెరికా ఈ సైనిక చర్యకు ఒడిగట్టింది. ఇదే అంశంపై మదురోను విచారించబోతున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్ వేదికగా ఈ న్యాయ విచారణ కొనసాగుతుంది.
వెనిజులపై అమెరికా దాడి చేసిన అనంతరం పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. అమెరికా శత్రుదేశాలు ఏకం అయ్యాయి. లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలన్నీ ఈ చర్యను ఖండించాయి. అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధం అయ్యాయి. కొలంబియా వంటి దేశాలు భగ్గుమంటోన్నాయి.

అటు ఐక్యరాజ్య సమితి సైతం రంగంలోకి దిగింది. ఈ దాడి అంశాన్ని చర్చించడానికి సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతమండలి అత్యవసరంగా సమావేశం కాబోతోంది. వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ తలెత్తిన ఉద్రిక్తతల గురించి భద్రతమండలి చర్చించబోతోంది. ఇదే ప్రధాన అజెండా కూడా. వెనిజులాపై దాడి, ఆ తర్వాతి పరిణామాలపై చర్చించడానికి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కొలంబియా చేసిన అత్యవసర అభ్యర్థన మేరకు, భద్రత మండలి సభ్య దేశాలు చైనా, రష్యా మద్దతుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన దేశానికి "స్వీయ రక్షణ హక్కు" ఉందని వెనిజులా రాయబారి పేర్కొన్న తర్వాత ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తొలగించిన తర్వాత ఆ దేశాన్ని తాత్కాలికంగా అమెరికా నియంత్రిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనిజులా ప్రభుత్వం ఈ సైనిక చర్యలను అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా తీవ్రంగా ఖండించింది. ఈ ఆపరేషన్ల లక్ష్యం వనరుల ఆక్రమణ, పాలన మార్పు అని ఆరోపించింది. వెనిజులా తన జాతీయ రక్షణను పటిష్టం చేసి, అంతర్జాతీయ జోక్యాన్ని కోరింది. ఈ ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి కొలంబియా కూడా అత్యవసర ఐరాస సమావేశాన్ని కోరింది. కరేబియన్లో అమెరికా సైనిక ఉనికి పెరిగిన అంశాన్ని కూడా చర్చించాలని పట్టుబట్టింది.












Click it and Unblock the Notifications