పాక్ కు చైనా భారీ సాయం.. భారత్ తో యుద్ధం చేసినందుకు.. సగం ధరకే యుద్ధ విమానాలు..!
తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు.. చేతిలో మాత్రం ఆయుధం ఉండాలి.. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్ అనుసరిస్తున్న తీరు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు ఉగ్రవాదుల లక్షణాలు నర నరమునా వ్యాప్తి చెందాయి. భారత్- పాకిస్థాన్ నేపథ్యంలో ఆ దేశంపై భారత్ కఠినమైన ఆంక్షలు విధించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ జలాల పంపిణీ రద్దు, వీసాల జారీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు.. తదితర చర్యల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. అయినా పాకిస్థాన్ మాత్రం యుద్ధ సామాగ్రి కొనుగోలు చేస్తూనే ఉంది. అటు టర్కీ, ఇటు చైనా నుంచి ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.
ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసి మరీ దేశ ఆర్థిక భారాన్ని నెట్టుకొస్తోంది పాకిస్థాన్. ఈ క్రమంలో చైనాతో మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. చైనాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. చైనా వీటిని సగం ధరకే పాకిస్థాన్ కు అందజేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.
చైనాకు చెందిన అత్యాధునిక ఐదోతరం స్టీల్త్ ఫైటర్ జెట్స్ J-35A లను పాకిస్థాన్ కు చేరవేసేందుకు సిద్ధమైంది. భారత్ తో యుద్ధం చేసినందుకు పాకిస్థాన్ కు ఈ భారీ రివార్డు అందజేసినట్లు దౌత్య అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 30 అత్యాధునిక ఐదోతరం J-35A ఫైటర్ జెట్స్ ను త్వరలోనే అందించనుంది. అది కూడా సగం ధరకే వీటిని పాక్ కు అందించేందుకు చైనా సిద్ధమైనట్లు సమాచారం. 2025 ఆగస్టులోపే ఈ యుద్ధ విమానాలు పాక్ అమ్ముల పొదిలో చేరనున్నాయి.
2024లోనే చైనాకు చెందిన 40 J-35A ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయాలని తీర్మానించింది. కానీ పలు కారణాల వల్ల ఆ ఒప్పందం ముందుకు రాలేదు. అయితే ఇటీవల ఇరు దేశాల డిఫెన్స్ ప్రతినిధులు సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ డీల్ ముందుకొచ్చినట్లు సమాచారం. అటు బలూచిస్థాన్, ఇటు భారత్ తో ప్రమాదం పొంచి ఉన్న కారణంగా పాకిస్థాన్.. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. దేశ ప్రజల అవసరాలు పక్కన బెట్టి యుద్ధ సన్నాహాలు చేస్తోందని పలు నిఘా సంస్థలు చెబుతున్నాయి.
ఇక ఇప్పటికే పాకిస్థాన్ కు చైనా సరఫరా చేసిన ఆయుధాల లిస్టు పెద్దగానే ఉంది. అందులో ప్రధానమైనది జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్. ఇలాంటివి ప్రస్తుతం పాక్ వద్ద 140 వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికాతో డీల్ క్యాన్సెల్ తర్వాత చైనా వీటిని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జే-10 సీఈ ఫైటర్ జెట్.. ఇది 4.5 మల్టీ జనరేషన్ ఫైటర్ జెట్. 2022లో పాకిస్థాన్ చైనా నుంచి 36 జే-10 సీఈ ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకుంది.

ఇక పాకిస్థాన్- చైనా మధ్య ప్రతిఏటా షాహీన్ ఈగల్ అనే పేరుతో యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. అంతేకాక అరేబియన్ సముద్రంలో ఇరు దేశాల మధ్య సాగర్ గార్డియన్ విన్యాసాలు కూడా జరుగుతాయి. ఈ క్రమంలో చైనా సరఫరా చేసిన ఆయుధాలు, సామాగ్రితో పాకిస్థాన్.. భారత్ తో మరోసారి తలపడాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications