చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్కు సమీపంగా.
దక్షిణ చైనా సముద్రంపై యుద్ధమేఘాలు ఆవహించాయి. ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు పోటాపోటీగా దుందుడుకు చర్యలకు దిగుతున్నాయి. నేల మీద చైనా బలగాలు యుద్ధ విన్యాసాలు చేస్తుండగా, పైనుంచి అమెరికా నిఘా విమానం యూ-2 చక్కర్లు కొట్టడంతో.. డ్రాగన్ దేశం ప్రతీకారంగా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పేల్చింది. అందులో ఒకటి భారత్ కు సమీపంగా ఉన్న భూటాన్ సరిహద్దుల నుంచి ప్రయోగించడం గగుర్పాటుకు గురిచేసింది. గడిచిన మూడు రోజులుగా రెండు దేశాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడం సర్వత్రా టెన్షన్ పుట్టిస్తోంది.
షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్
అసలేం జరిగిందటే..
చైనాకు ఉత్తరంగా ఉన్న బొహాయి సముద్ర తీరంలో ఆ దేశ నౌక, సైనిక దళాలు మంగళవారం యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. పూర్తి స్థాయి ఆయుధాలతో డ్రిల్ చేస్తుండగా, అమెరికాకు చెందిన నిఘా విమానం యూ-2 అటువైపుగా దూసుకొచ్చిందని, నో ఫ్లై జోన్ లోకి విమానాల్ని పంపడం అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించడమేనని చైనా ఆరోపించింది. అయితే అమెరికా మాత్రం తాము ఉల్లంఘనకు పాల్పడలేదని, నో ఫ్లై జోన్ లోకి ప్రవేశించలేదని స్పష్టం చేసింది. ఈ వివాదానికి కొనసాగింపుగా చైనా గురువారం రెండు మిస్సైళ్లను పేల్చింది.
శక్తిమంతమైన డీఎఫ్ మిస్సైల్స్..
నో ఫ్లై జోన్ లోకి నిఘా విమానం ఎంటరైందన్న ఫిర్యాదును అమెరికా తేలికగా తీసుకోవడంతో చైనా సైతం ప్రతీకారానికి దిగింది. తన అమ్ములపొదిలోని శక్తిమంతమైన డీఎఫ్ శ్రేణి క్షిపణులను పేల్చింది. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం.. జింగాయ్ ఫ్రావిన్స్ నుంచి డీఎఫ్-26బీ మిస్సైల్ ను పేల్చింది. మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైలైన డీఎఫ్-26బీకి ‘‘ఎయిర్ క్రాఫ్ట్ కిల్లర్'' అనే బిరుదు కూడా ఉంది. దీన్ని పేల్చడం ద్వారా అమెరికాకు గట్టి రిటార్ట్ ఇచ్చినట్లవుతుందని, ఇంకోసారి నో ఫ్లై జోన్ లోకి ప్రవేశిస్తే విమానాలను కూడా పేల్చేస్తామని డ్రాగెన్ వార్నింగ్ ఇవ్వదల్చుకున్నట్లు డిఫెన్స్ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
రెండో మిస్సైల్ భారత్కు దగ్గరగా..
అమెరికాను హెచ్చరించేందుకు చైనా గురువారం పేల్చిన రెండు బాలిస్టిక్ మిస్సైళ్లలో ఒకటి జింగాయ్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించగా... రెండో దాన్ని జిజియాంగ్ ఫ్రావిన్స్ నుంచి ప్రయోగించినట్లు ‘‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'' తెలిపింది. చైనా ఆక్రమణలోని టిబెట్ ఈ ఫ్రావిన్స్ కిందికే వస్తుంది. అంటే, భారత్ ను ఆనుకుని ఉన్న చైనా ఫ్రావిన్స్ నుంచే క్షిపణి ప్రయోగం జరిగిందన్నమాట. మిస్సైల్ టార్గెట్ సౌత్ చైనా సముద్రం వైపే అయినప్పటికీ, భారత్ తో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇక్కడి నుంచే ఎందుకు పేల్చాల్సి వచ్చిందనే చర్చ మొదలైంది.
Recommended Video
విధ్వంసం జరిగిందా?
నో ఫ్లై జోన్ లోకి అమెరికా నిఘా విమానాలు మళ్లీ రాకుండా హెచ్చరించే క్రమంలో చైనా క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు క్షిపణులకూ అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉందని, 4500 కిలోమీటర్లు ప్రయాణించలగ వీటికి.. సముద్రంలో, గగనతలలో కదులుతోన్న టార్గెట్లను సైతం పేల్చేయగల సత్తా ఉందని చైనీస్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గురువారం నాటి ప్రయోగంలో ఎలాంటి విధ్వంసం జరగలేదని, ఆ రెండు మిస్సైల్స్ ‘పారాసెల్ దీవులు-హైనాన్ ఫ్రావిన్స్ తీరం మధ్యలో సముద్రంలో పడ్డాయని పోస్ట్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ చైనాతో విభేదాలు ఇంకా పెరుగుతుండటం గమనార్హం.