భారత్ సరిహద్దు వెంబడి స్థానాలు మరింత కఠినతరం.. చైనాపై అమెరికా రక్షణమంత్రి గుస్సా
డ్రాగన్ చైనా వంకరబుద్ది మారడం లేదు. సరిహద్దు వెంబడి స్థానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ ప్రాంతంలో గల దేశాలు బీజింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్ జె ఆస్టిన్ అన్నారు. భారత్ సరిహద్దుకు ఎదురుగా ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన ఆందోళనకరంగా ఉందని అమెరికా ఆర్మీ జనరల్ చెప్పిన కొద్ది రోజులపై ఈ కామెంట్స్ చేశారు.
సింగపూర్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ భద్రతా సదస్సు నిర్వహించింది. చైనా అగ్రనేతలు కూడా సదస్సులో పాల్గొన్నారు. బీజింగ్, భారత్తో పంచుకునే సరిహద్దు వెంబడి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం మనం చూస్తున్నాం అని ఆస్టిన్ అన్నారు. ఇండో-పసిఫిక్ దేశాలు రాజకీయ బెదిరింపులు, ఆర్థిక బలవంతం లేదంటే సముద్ర మిలీషియాల వేధింపులను ఎదుర్కోకూడదని అభిప్రాయపడ్డారు.
తూర్పు చైనా సముద్రంలో తన ఫిషింగ్ ఫ్లీట్ను చైనా విస్తరిస్తోంది. ఇదీ పొరుగువారితో ఉద్రిక్తతలను రేకెత్తిస్తోందని ఆస్టిన్ చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో, చైనా అధునాతన ఆయుధాలను కలిగి ఉన్న మానవ నిర్మిత ద్వీపాలలో అవుట్పోస్టులను అక్రమ సముద్ర క్లెయిమ్లను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగిస్తోందని చెప్పారు.
అమెరికాకు భాగస్వామిగా భారతదేశం ఉందన్నారు. ఇతర భాగస్వాములతో కూడా సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం గురించి ఆలోచిస్తున్నామని.. పెరుగుతున్న సైనిక సామర్థ్యం మరియు సాంకేతిక పరాక్రమం ఈ ప్రాంతంలో స్థిరీకరణ శక్తిగా ఉంటుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.