చైనాలో మళ్లీ కరోనా కలకలం: 10 నగరాల్లో కంప్లీట్ లాక్డౌన్: రెండేళ్ల తరువాత ఆ స్థాయిలో
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చైనాలో ఇప్పుడు మళ్లీ మహమ్మారి కలకలం చెలరేగింది. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 2019లో హ్యూబె ప్రావిన్స్లోని వుహాన్లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిన రోజులను గుర్తు చేస్తోన్నాయి. రోజువారీ కొత్త కేసులు భారీగా పెరిగాయి. శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని- చైనా మళ్లీ లాక్డౌన్ విధించింది.
చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ ప్రావిన్స్లో కొత్తగా 24 గంటల వ్యవధిలో 5,280 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఈ ప్రావిన్స్లో కొత్తగా కంప్లీట్ లాక్డౌన్ను విధించింది. 23 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ప్రావిన్స్ ఇది. ఇప్పటికే ఈ ప్రావిన్స్ రాజధాని చాంగ్చున్తో పాటు షాన్డాంగ్ ప్రావిన్స్లోని యుచెంగ్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా జిలిన్ ప్రావిన్స్లోని 10 నగరాలకు లాక్డౌన్ను విస్తరింపజేసింది. ఇందులో షెన్ఝెంగ్ కూడా ఉంది.
ఈ 10 నగరాల్లో లాక్డౌన్ అమల్లోకి తీసుకొచ్చినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. రాకపోకలను నిషేధించింది. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, దీన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. షెన్ఝెన్ సిటీలో జనాభా అధికం. ఇక్కడి జనాభా కోటిన్నరకు పైమాటే. పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందింది. గ్యాడ్జెట్స్ హబ్ ఇది. ఫాక్స్కాన్, హువావే, టెన్ సెంట్ వంటి టాప్ కంపెనీలకు చెందిన ప్రధాన కార్యాలయాలన్నీ షెన్జెన్లోనే కొనసాగుతున్నాయి.
యాపిల్ కంపెనీకి ప్రధాన సరఫరాదారు ఫాక్స్కాన్. అలాంటి నగరంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించాల్సి వచ్చిందంటే- కోవిడ్ అవుట్ బ్రేక్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల తరువాత అప్పటి పరిస్థితులను సమీక్షించిన తరువాతే.. లాక్డౌన్ను కొనసాగించాలా? వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ హెల్త్ కమిషన్ స్పష్టం చేసింది.
కాగా- భారత్లో కరోనా వైరస్ కేసుల తీవ్రత నామమాత్రం. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 2,568 మాత్రమే. 4,722 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 97 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 33,917గా నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.37 శాతంగా రికార్డయింది. ఇప్పటిదాకా 4,24,46,171 మంది కోవిడ్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. 5,15,974 మంది వైరస్కు బలి అయ్యారు.