రెచ్చిపోతున్న చైనా: పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా.., ఇది ప్లాన్!
చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరకు రవాణా చేపట్టాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
బీజింగ్/న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరకు రవాణా చేపట్టాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండటంతో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
చదవండి: వెళ్లిపోతారా, వెళ్లగొట్టమంటారా: భారత్కు చైనా వార్నింగ్, రోడ్డుపై ట్విస్ట్
చైనాలోని గన్సూ రాష్ట్ర రాజధాని లాంఝౌ నుంచి స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన జింగ్జియాంగ్లోని కష్గర్ మీదుగా పాకిస్తాన్లోని గ్వదర్ పోర్ట్ వరకు కొత్త మార్గం ఉంటుంది. లాంఝౌ అంతర్జాతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ పార్క్ డైరెక్టర్ జు చున్హువా ఈ విషయం తెలిపారు.
ఇది చైనా ప్లాన్!
రవాణా సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో ఆయన స్పష్టం చేయలేదు. గత ఏడాది మేలో చైనా లాంఝౌ నుంచి నేపాల్లోని ఖాట్మాండ్ వరకు రైలు, రోడ్డు మార్గాల్లో సరకు రవాణా సేవలు ప్రారంభించింది. కొత్తగా చేపట్టబోయే మార్గం ద్వారా ఆఫ్రికా, ఐరోపా, మధ్య ప్రాచ్య దేశాలకు సరకులు ఎగుమతి చేయాలని చైనా ఆలోచిస్తోంది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మీడియా
భారత్పై చైనా మీడియా రెచ్చిపోతోంది. చైనా-భారత్-భూటాన్ ట్రై జంక్షన్లో ఏకపక్షంగా రోడ్డు నిర్మాణానికి చైనా చేస్తున్న దుస్సాహసాన్ని నిలదీసినందుకు భారత్పై అక్కసు వెళ్ళగక్కుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ డైలీ ఆధ్వర్యంలో వెలువడుతున్న అతివాద పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.
భారత్ ఆధిపత్యానికి ముగింపు పలకాలి
గుడ్డి బెదిరింపులకు దిగుతున్న భారత్ తాజా సరిహద్దు వివాదం నుంచి వెనక్కు తగ్గకపోతే, స్వాతంత్ర్యం కోసం సిక్కింలో వస్తున్న విజ్ఞప్తులకు మద్దతివ్వడం ప్రారంభించాలని చైనా ప్రభుత్వాన్ని ఆ పత్రిక రెచ్చగొట్టింది. భారత్ను ఎదుర్కొనాలంటే సిక్కిం స్వాతంత్ర్యానికి మద్దతివ్వడమే శక్తిమంతమైన పాచిక అవుతుందని పేర్కొంది. సిక్కిం సమస్యపై చైనా తన వైఖరిని పునరాలోచించాలని పేర్కొంది. భారత్ కవ్వింపులకు తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పింది. ఈ ప్రాంతంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతున్న భారత్ ఆధిపత్యానికి ముగింపు పలకాలని పేర్కొంది.
విడిపోవడానికి మద్దతివ్వొచ్చునని...
భారత్ సిక్కింను కలుపుకోవడానికి చైనా 2003లో గుర్తింపు ఇచ్చినప్పటికీ, ఈ విషయంలో చైనా తన వైఖరిని తిరిగి సర్దుబాటు చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రత్యేక రాజ్యంగా సిక్కిం చరిత్రను మధుర జ్ఞాపకంగా ఉంచుకున్నవారు అక్కడ ఉన్నారని, సిక్కిం సమస్యను ప్రపంచం ఎలా చూస్తున్నదోనన్న అంశాన్ని వారు గమనిస్తున్నారని పేర్కొంది. స్వాతంత్ర్య అనుకూల విజ్ఞప్తులను రెచ్చగొట్టడం ద్వారా భారత్ నుంచి సిక్కిం విడిపోవడానికి చైనా మద్దతివ్వవచ్చునని పేర్కొంది. సిక్కిం స్వాతంత్రానికి మద్దతిచ్చే గళాలు చైనా సమాజంలో ఉన్నంత వరకు, ఆ గళాలు విస్తరిస్తాయని, సిక్కింలో విజ్ఞప్తులకు సహకరిస్తాయని పేర్కొంది.
అలా సిక్కింను వశం చేసుకుందని..
1960, 1970లలో సిక్కిం సార్వభౌమాధికారం కోసం జరిగిన తిరుగుబాట్లపై భారత్ కిరాతకంగా విరుచుకుపడిందని ఆ పత్రిక పేర్కొంది. 1975లో సిక్కిం రాజును పదవీచ్యుతుడిని చేసి, సిక్కింను భారతదేశంలో ఓ రాష్ట్రంగా చేసుకుందని పేర్కొంది. సిక్కింను భారతదేశం కలుపుకోవడం భూటాన్ను వెంటాడుతున్న పీడకల వంటిదని పేర్కొంది.
ఆ సాకుతో..
తాజా సరిహద్దు వివాదంలో తన వైపు ఉండాలని భూటాన్ను భారత్ నిర్బంధిస్తోందని ఆరోపించింది. భూటాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో సహకరిస్తామన్న సాకుతో, చైనా భూభాగంలో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు భారత్ సిగ్గు లేకుండా అడ్డుపడుతోందని పేర్కొంది. భూటాన్తో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవడానికి చైనా మరింత కృషి చేయాలని పిలుపునిచ్చింది.